చంద్రబాబునాయుడు రెండు పడవల్లో కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తున్నారా ? చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఒకవైపు కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతూనే మరోవైపు భారతీయ జనతా పార్టీతో మళ్ళీ చెలిమికి అవకాశాలు వెతుక్కుంటున్నట్లు అనుమానంగా ఉంది.
ఏదో పార్టీతో పొత్తు తప్పదు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటిరిగా పోటీ చేసే అవకాశాలు లేవన్నది మాత్రం స్పష్టం. ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలాగుంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఏదో ఒక పార్టీతో పొత్తు అయితే తప్పదు. చంద్రబాబు పొత్తులు పెట్టుకోవటానికి కొత్తగా కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ మిగలలేదు. అందుకనే కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో పొత్తుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి బెంగుళూరు వెళ్ళినపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధితో వేదికపైనే రాసుకుపూసుకు తిరిగింది అందరూ చూసిందే.
కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ
అంతకుముందు వరకూ రాష్ట్ర విభజన అంశం కావచ్చు లేదా ఏ విషయంపైనైనా కాంగ్రెస్ పై విరుచుకుపడే చంద్రబాబు ఈమధ్య కాలంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రెస్సేనని చెప్పటం గమనార్హం. అంతుకుముందు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా తెలంగాణాలోని ముంపు మండలాలను కాంగ్రెస్సే ఏపిలో కలిపిందంటూ చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో పాలనా వైఫల్యాల్లో చంద్రబాబును విమర్శించటం మానేసి కాంగ్రెస్ నేతలు కూడా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటువంటి పరిణామాలతో కాంగ్రెస్-టిడిపి పొత్తు ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది.
గడ్కరీ తో సాఫ్ట్ కార్నర్
ఈ నేపధ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన గడ్కరీతో చంద్రబాబు చాలా సామరస్యంగా మాట్లాడటం గమనార్హం. అదే సందర్భంలో తనకు కేంద్రప్రభుత్వంపై ఏమీ కోపం లేదని, విభజన హామీలను నెరవేరిస్తే చాలంటూ గడ్కరీతో చెప్పటం విచిత్రంగా ఉంది. అంటే విభజన హామీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తగిన హామీ ఇస్తే మళ్ళీ బిజెపితో చెలిమికి అభ్యంతరం లేదన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. చంద్రబాబు తరపునుండి మొదలైన తాజా పరిణామాలతో ఏ పార్టీతో వీలుంటే ఆ పార్టీతో పొత్తుకు రెడీ అవుతున్నట్లు అర్ధమవుతోంది. అంటే ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నట్లుంది.