చంద్రబాబునాయుడు- టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కు మధ్య గ్యాప్ వచ్చిందా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఎలాగంటే రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి టిజి వెంకటేష్ హాజరుకాలేదు. మొదట్లో లోకేష్ పై అలిగిన టిజి సమావేశానికి డుమ్మాకొట్టి తన నిరసనను తెలిపారని అనుకున్నారు. కానీ ఇపుడు తాజాగా బయటపడిన విషయం ఏమిటంటే అసలు టిజికే సమావేశానికి రమ్మని ఆహ్వానం అందలేదట.
చంద్రబాబే దూరం పెట్టారా ?
అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చంద్రబాబే టిజిని దూరంగా పెట్టారని అర్ధమవుతోంది. టిజిని దూరంగా బయటపెట్టాల్సిన అవసరం ఏంటంటే లోకేష్ ఆధిపత్యాన్నే టిజి ప్రశ్నించటం అందరికీ తెలిసిందే. ఆమధ్య లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళిన సంగతి గుర్తుందికదా ? ఆ పర్యటనలో కర్నూలు ఎంఎల్ఏ, ఎంపి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న ఎస్వీ మోహన్ రెడ్డి, బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే కదా ? అప్పుడే జిల్లా నేతల మధ్య చిచ్చు మొదలైంది.
ఎవరికైనా ఇదే పరిస్దితా ?
టిక్కెట్ల ప్రకటనతో లోకేష్ పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. అప్పటి నుండి లోకేష్ ఆధిపత్యాన్ని టిజి సవాలు చేసినట్లుగా మట్లాడారు. టిక్కెట్ల ప్రకటనలో లోకేష్ అధికారాలనే టిజి బహిరంగంగా ప్రశ్నించారు. లోకేష్ ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రశ్నించిన మొదటి వ్యక్తి టిజినే అన్న విషయం గుర్తుంచుకోవాలి. టిజి చర్యలతో చంద్రబాబుకు ఎక్కడో మండింది. దీన్ని ఇక్కడతో తుంచేయకపోతే భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని చంద్రబాబు గ్రహించారు. అందుకనే సమీక్షా సమావేశానికి టిజిని దూరంగా పెట్టారట. అంటే లోకేష్ అధికారాన్ని ప్రశ్నిస్తే ఎవరికైనా ఫలితం ఇంటే అని చంద్రబాబు చెప్పకనే చెప్పారన్నమాట.