వర్షాకాల పార్లమెంటు సమావేశాలు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అందరి చూపు వైసిపి పైనే పడింది. కారణమేంటంటే, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయించటమే అందుకు కారణం. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో వైసిపి కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
చంద్రబాబు పిల్లిమొగ్గలు
అప్పట్లో వైసిపి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఒకసారి మద్దతు ఇస్తున్నట్లు మరోసారి తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని చంద్రబాబు పలుమార్లు పిల్లి మొగ్గలు వేసిన సంగతి అందరూ చూసిందే. మొత్తానికి వైసిపి ప్రవేశపెట్టిన తీర్మానానికి పోటీగా చంద్రబాబు కూడా ఓ తీర్మానం ప్రవేశపెట్టామనిపించుకుని చేతులు దులుపుకున్నారు. తర్వాత ఢిల్లీ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలన్నీ అందరూ చూసిందే. మొత్తం మీద అప్పట్లో వైసిపికే ఎక్కువ మైలేజ్ వచ్చింది.
ముందుగానే మేల్కొన్న టిడిపి
అందుకనే చంద్రబాబు ఇపుడు కాస్త ముందుగా మేల్కొన్నట్లున్నారు. అందులో భాగంగానే 18వ తేదీ నుండి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో కేంద్రపై తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించేశారు. అంతేకాకుండా జాతీయ స్ధాయిలోని పార్టీల అధినేతల మద్దతు కోరుతూ లేఖలు కూడా రాసేశారు. దానికితోడు వైసిపికి లోక్ సభలో ఎంపిలు లేకపోవటం కూడా చంద్రబాబుకు కలసివస్తోంది.
జగన్ వ్యూహమేంటి ?
సరే, వైసిపికి లోక్ సభలో బలం లేదన్న మాట అందరికీ తెలిసిందే. మరి, రాజ్యసభలో వైసిపి ఏం చేస్తుంది ? ఉన్న ఇద్దరిలో వేనాటి ప్రభాకర్ రెడ్డి సభకు కొత్త. కాబట్టి మొత్తం భారమంతా విజయసాయిరెడ్డిపైనే ఉంది. కాబట్టి మొత్తం వర్షాకాల సమావేశాల్లో సభలో వైసిపి ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందనే విషయంపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.