తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలే కాదు చివరకు ఫిరాయింపు ఎంఎల్ఏలు సైతం భూ కబ్జాలకు యధేచ్చగా దిగేస్తున్నారు. కబ్జాల్లో తన మన అని కూడా చూడకుండా చివరికి తోడబుట్టిన వాళ్ళ భూములు కూడా కబ్జా చేసేస్తున్నట్లు తాజాగా బయటపడిన ఓ ఘటనతో స్పష్టమైంది. వీడియోలో గిడ్డి రోడ్డుపై పడిపోవటమే కాకుండా తన వదినతో గొడవ పడుతుండటం వైరల్ అయ్యింది.
అన్న భూమినే ఎంఎల్ఏ కబ్జా
ఇంతకీ విషయం ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి కబ్జా పర్వం తాజాగా బయటపడింది. ఈశ్వరి తన వదన అయ్యే మహిళతో నడిరోడ్డుపై ఓ భూమి వ్యవహారంలో గొడవపడటం వైరల్ గా మారింది. సదరు మహిళ పేరు గిడ్డి విజయలక్ష్మి. ఎంఎల్ఏ సోదరుని భార్య. ఆమె జడ్పిటిసి. వీడియో ప్రకారం పై ఇద్దరూ రోడ్డుపైనే గొడవపడ్డారు. గొడవ అంటే ఎంఎల్ఏ విజయలక్ష్మిపై నెట్టేస్తూ చివరకు తానే రోడ్డుపై ఎంఎల్ఏ పడిపోయారు. అయితే, సదరు మహిళ మాత్రం ఎంఎల్ఏను ఏమీ అనలేదు. పైగా ఆమెను ఎంఎల్ఏనే నెట్టేస్తూ తనను తోయవద్దని ఆమెపై అరుస్తుండటం విచిత్రంగా ఉంది.
పోలీసులు పట్టించుకోలేదట
వీరి గొడవను సర్దుబాటు చేయటానికి వచ్చిన ఇంకో వ్యక్తిపైన కూడా ఎంఎల్ఏనే మండపడుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనబడటమే కాదు డైలాగులు కూడా వినబడుతోంది. స్ధానికుల సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఓ భూమి పంచాయితీ చాలా కాలంగా నడుస్తోందట. సొంత వదినతోనే ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి భూమి కోసం గొడవ పడుతోందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. కాకపోతే ఎంఎల్ఏ కాబట్టి పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి వెనకాడుతున్నారని స్ధానికులంటున్నారు.