గోటితో పోయేదాన్ని కొండంత చేసి కంపు చేసుకోవటం ఎలాగో ప్రస్తుత టిటిడి ట్రస్టు బోర్టుకు తెలిసినంగా ఇంకెవరికీ తెలీదేమో. తిరుమల శ్రీవారి ఆలయం కేంద్రంగా ఇపుడు జరుగుతున్న వివాదం, రచ్చ చూస్తుంటే అందరికీ అవే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే నెల 11 నుండి 16వ తేదీ వరకూ ' అష్టాబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ' జరుగుతుంది. అంతవరకూ ఓకే. కానీ ఆ పేరు చెప్పి ఆగష్టు 9వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టిటిడి ట్రస్ట్ బోర్డు చేసిన ప్రకటనే ఈ కంపు కంతా ప్రధాన కారణం. దర్శనం మాత్రమే కాదు ఏకంగా భక్తులెవరూ అసలు తిరుమలకే వచ్చేందుకు లేదంటూ ట్రస్ట్ బోర్టు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తొలుత చేసిన ప్రకటనే వివాదానికి ప్రధాన కారణం.
ఛైర్మన్ నియామకమే పెద్ద వివాదం
అసలు బోర్డు నియామకమే పెద్ద వివాదమైంది. బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్తియన్ అంటూ పెద్ద వివాదమే నడుస్తోంది. దానిమీద దశాబ్దాల పాటు ఆలయ ప్రధానార్చుకునిగా ఉన్న అర్చకం రమణదీక్షితులను తొలగించిన వివాదం ఛైర్మన్ నియామకం వివాదానికి బోనస్ అయ్యింది. ఆ తర్వాత శ్రీవారి ఆభరణాల మాయమయ్యాయన్న రమణదీక్షతుల ఆరోపణలు తదితరాలు కలిసి బోర్డును నిత్యం వివాదాల్లోనే ఉంచుతోంది. వాటన్నింటి మీద శ్రీవారి ఆలయం మూసివేత అంశం కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారినట్లైంది.
శ్రీవారి పవళింపుకు సమయమే ఉండటం లేదు
మహాసంప్రోక్షణ సమయంలో ఆలయం మూసివేయటం చాలా సహజం. పుష్కరకాలం క్రితం కూడా ఇదే విధంగా సంప్రోక్షణ జరిగింది. మరి అప్పుడు రాని వివాదం ఇపుడే ఎందుకు వచ్చింది. అంటే, అప్పట్లో విషయాన్ని అప్పటి పాలకులు స్మూత్ గా హ్యాండిల్ చేశారు. ఇపుడు కంపు చేసుకున్నారు. అంతే తేడా. ఇపుడు ప్రతిరోజు ఆలయంలో సగటున కైంకర్యాలు, పూజలు, నిత్య సేవలన్నీ కలిపి సుమారు 16 గంటలు జరుగుతోంది. దాంతో శ్రీవారి పవళింపు సమయం కుచించుకుపోతోందన్నది వాస్తవం.
శ్రీవారి దర్శనానికి 35 వేలమంది
ఆలయ అధికారుల లెక్కల ప్రకారం అన్నీ సేవల్లో కలుపుకుని రోజుకు సుమారు 35 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. అన్ని వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నపుడు సంప్రోక్షణ చేయాలంటే సాధ్యం కాదు. అందుకనే ఆలయాన్ని పూర్తిగా మూసేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపేసే అధికారం ఎవరికీ లేదు.
ఆన్ లైన్లో టిక్కెట్లు జారీ చేస్తే సరిపోయేది
దర్శనాన్ని పూర్తిగా 6 రోజుల పాటు నిలిపేసే బదులు రోజుకు ఇన్ని వేల మందిని మాత్రమే అనుమతిస్తామని ఆలయ అధికారులు చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే, ప్రతీ దర్శనం ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారు భక్తులు. ధర్మదర్శనం మినహా మిగిలిన అన్నీ సేవలను నిలిపేస్తున్నట్లు బోర్డు ప్రకటించుంటే బాగుండేది. ధర్మదర్శనం చేసుకోదలుచుకున్న భక్తులు మాత్రం ఆన్ లైన్లో బుక్ చేసుకుని తిరుమలకు వచ్చేవారు. ఎలాగూ రోజుకు 35 వేల మంది మాత్రమే దర్శనం చేసుకోగలుగుతున్నట్లు అధికారులే ప్రకటించారు కాబట్టి అపుడు పెద్ద సమస్య కూడా తలెత్తేది కాదు.
మొదలైన భక్తుల అభిప్రాయ సేకరణ
జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తొందరపాటుగా తీసుకుని ప్రకటించటంతో మొత్త వ్యవహారం కంపుగా తయారైంది. చివరకు చంద్రబాబునాయుడు కూడా జోక్యం చేసుకుని అధికారులకు అక్షింతలు వేసిన తర్వాత అందరూ మేల్కొన్నారు. ఆలయం మూసివేత తదితరాలపై ఈరోజు నుండి భక్తుల అభిప్రాయాల సేకరణకు పూనుకున్నారు అధికారులు. బోర్డు నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులందరూ మండిపడుతున్నారు. శ్రీవారి దర్శనాన్ని భక్తులకు దూరం చేసే అధికారం ఎవరికీ లేదని ధ్వజమెత్తుతున్నారు. మరి ఈ వివాదం ఏ విధంగా ముగుస్తుందో గమనించాల్సిందే.