అవిశ్వాసంతో కేంద్రం దిగొస్తుందా ? అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? అని అడగటం లాంటిదే. ఎందుకంటే,మంత్రాలకు చింతకాయలు రాలేదిలేదు..అవిశ్వాసంతో కేంద్రం దిగొచ్చేది లేదు. ఈ విషయం మొన్నటి బడ్జెట్ సమావేశాల్లోనే తేలిపోయింది. ఒకవైపు టిడిపి ఎంపిలు, మరోవైపు వైసిపి ఎంపిలు విడివిడిగానే అయినా అవిశ్వాస తీర్మానాలు అందచేశారు. రెండు పార్టీలు కూడా వేటికవి ఇతర పార్టీల మద్దతును కూడా కూడగట్టాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. అప్పట్లోనే అవిశ్వాస తీర్మానాలను ఖాతరు చేయని నరేంద్రమోడి సర్కార్ ఇపుడు టిడిపి ఇచ్చే అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకుంటుందని ఎవరూ అనుకోవటం లేదు.
ఎందుకు పట్టించుకోదు ?
ఇటు వైసిపి అయినా అటు టిడిపి అయినా మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన తీర్మానాలను కూడా మోడి చాలా లైట్ గా తీసుకున్నారు. ఎందుకంటే, బహుశా రెండు పార్టీల్లోనూ చిత్తశుద్ది కనిపించలేదేమో ? అదే సమయంలో ఎన్ని పార్టీలు కలిసినా మోడి సర్కార్ ను గద్దె దింపటమో లేకపోతే మెడలు వంచి కావాల్సింది సాధించుకునే స్ధితిలో లేకపోవటమే కారణాలు కావచ్చు. ప్రతిపక్షాలతో ఎటువంటి సమస్యలు లేవని తేలిపోయిన తర్వాత అధికార పార్టీ ఇంకెందుకు లెక్క చేస్తుంది ?
చంద్రబాబు పిల్లి మొగ్గలు
ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు వేసిన పిల్లి మొగ్గలను అందరూ చూసిందే. ఎన్డీఏలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రత్యేకహోదా అన్న మాటనే వినబడకుండా ప్రయత్నాలు చేసిన వ్యక్తి. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆందోళనల్లో ఎవరినీ పాల్గొనకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే ఒక్కసారిగా ప్రత్యేకహోదాపై యు టర్న్ తీసుకుంటే చిత్తశుద్దిని శంకించకుండా ఎలా ఉంటారు ? అందుకే చంద్రబాబు డిమాండ్ ను మోడి ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. రేపైనా దాదాపు అదే పరిస్ధితి ఉంటుందనటంలో సందేహం లేదు.
వైసిపి రోల్ ఏమిటి ?
మొన్నటి ఎన్నికల్లోనే కేంద్రప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయిన వైసిపి రేపటి రోజున చేయటానికి కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే, లోక్ సభలో ఉన్న ఐదుమంది ఎంపిలూ రాజీనామాలు చేసేశారు. కాబట్టి లోక్ సభలో వైసిపి బలం సున్నా. ఇక, రాజ్యసభలో ఉన్నదే ఇద్దరు. కాబట్టి టిడిపి ఇచ్చే అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వస్తే మాట్లాడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. అందుకనే జగన్ కానీ ఇతర వైసిపి నేతలు కానీ అవిశ్వాస తీర్మానం గురించి పెద్దగా మాట్లాడటం లేదు. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఇంత కీలకమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం పాత్ర నామమాత్రమే అనటంలో సందేహమే లేదు.
విపక్షాల మద్దతు ఇస్తాయా ?
తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి ఇటు లోక్ సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ప్రతిపక్షాల్లో ఎన్నిపార్టీలు మద్దతిస్తాయో చూడాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాల్లో అత్యధికం యూపిఏలోనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే యూపిఏ పక్షాలేవీ టిడిపికి మద్దతిచ్చే అవకాశాలు కనిపించటం లేదు. అంటే యూపిఏలో లేని విపక్షాల మద్దతును మాత్రమే టిడిపి సంపాదించాలి. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ఏపి వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాంది ప్రకటించారు. అదే గనుక నిజమైతే అపుడు చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. మరి అపుడు పార్లమెంటు వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే .