తెలుగుదేశంపార్టీలో దశాబ్దాల అనుబంధాన్ని యర్నా కుటుంబం తెంచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా బాగా పట్టున్న యర్రా నారాయణ స్వామి కొడుకు యర్ర నవీన్ టిడిపికి రాజీనామా చేశారు. తన రాజీనామా సందర్భంగా మాట్లాడుతూ, త్వరలో తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. దాంతో ఇంత కాలం నవీన్ రాజకీయ భవిష్యత్తుపై ఉన్న సస్పెన్స్ విడిపోయింది.
టిడిపికి పెద్ద దెబ్బే
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో యర్రా నారాయణ స్వామి అంటే తెలియని వారుండరు దాదాపు. రాజ్యసభ సభ్యునిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా , మంత్రిగా టిడిపితో దశాబ్దాల అనుబంధం ఉంది. అటువంటి నారాయణ స్వామి కొడుకు నవీన్ టిడిపిలో యాక్టివ్ గా నే ఉన్నారు. మొన్నటి వరకూ నవీన్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఉండేవారు. రామానుజయ తర్వాత ఛైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని చంద్రబాబునాయుడును నవీన్ అడిగారు. అయితే, ఛైర్మన్ పదవిని నవీన్న కు కాదని కొత్తపల్లి సుబ్బరాయుడుకు ఇచ్చారు. అప్పటి నుండి టిడిపికి నవీన్ దూరంగా ఉంటున్నారు. వైసిపిలో చేరుతారని కూడా ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
కాపులను చంద్రబాబు మోసం చేశారట
అయితే, హటాత్తుగా నవీన్ ఈ రోజు జనసేనలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. సరే, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎటూ ఆ పార్టీపై రాళ్ళు విసరటం మామూలైపోయింది. ఇపుడు నవీన్ కూడా అదే పనిచేశారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారట. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు.
తాడేపల్లిగూడెంపై కన్ను
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధానాలు నచ్చే తాను జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. ఈమధ్య తనతో వైసిపి నేతలు కూడా మాట్లాడినట్లు నవీన్ అంగీకరించారు. అయితే, స్వయంగా పవన్ కల్యాణ్ ఆహ్వానించటంతో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు నిర్వహిస్తానని కూడా చెప్పటం విశేషం. అంటే వచ్చే ఎన్నికల్లో నవీన్ తాడేపల్లిగూడెంలో జనసేన తరపున పోటీ చేయటం ఖాయమని అర్ధమవుతోంది.