మొత్తానికి కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకురవాటంలో టిడిపి సక్సెస్ అయ్యింది. వచ్చే శుక్రవారం లోక్ సభలోను సోమవారం రాజ్యసభలోను చర్చకు స్పీకర్ అనుమతించారు. లోక్ సభలో చర్చకు ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేశారు. చర్చ జరిగేది ఒక్క రోజే అయినా అది టిడిపి సక్సెస్ క్రిందే లెక్క. ఆరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ తీర్మానంపై చర్చ జరుగుతుంది.
తెరవెనుక రాజకీయమే వర్కవుటైందా ?
మొత్తానికి టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రప్పించటంలో చంద్రబాబునాయుడు వ్యూహం బాగానే వర్కవుటయినట్లు కనబడుతోంది. అవిశ్వాస తీర్మానం విషయంలో స్పీకర్ సానుకూలంగా స్పందించటంలో తెరవెనుక జరిగిన రాజకీయమే ప్రధాన పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. లేకపోతే మొన్నటి వరకూ అటు వైసిపి, ఇటు టిడిపి ఎంపిలు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోని విషయం అందరూ చూసిందే. వైసిపి అయితే ఏకంగా 13 సార్లు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు చాలా పట్టుబట్టారు. అయినా స్పీకర్ పట్టించుకోలేదు.
నివ్వెరపోయిన వైసిపి
మొత్తానికి ప్రత్యేకహోదా డిమాండ్ తోనే వైసిపి ఎంపిలు రాజీనామాలు చేయటం, తర్వాత ఏపి భవన్లో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవటం కూడా అందరికీ తెలిసిందే. దాంతో నరేంద్రమోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు లేవని వైసిపి తీర్మానించుకున్నది. అయితే ఈరోజు నుండి మొదలైన వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజునే టిడిపి మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టటం, దాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోవటం చకచకా జరిగిపోయింది. అదే ఊపులో వచ్చే శుక్రవారం లోక్ సభలో చర్చకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించటంతో వైసిపితో పాటు అందరూ ఆశ్చర్యపోతున్నారు.