పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నుంచి బుట్టా రేణుకకి ఆహ్వానం అందింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆమెకు అవకాశం లభించింది. సహజంగానే, ఈ ఎపిసోడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుంది.. ఇచ్చింది కూడా.! షాక్ నుంచి తేరుకున్న వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ తీరుని ఖండించేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితోపాటు, ప్రధాన మంత్రికీ జరిగిన విషయమై ఫిర్యాదు చేశారట.
2014 ఎన్నికల్లో బుట్టారేణుక, కర్నూలు నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అయితే, ఆమె గెలిచింది వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా. కానీ, ఆమె ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే 'చినబాబు' నారాలోకేష్ ప్రకటించేశారు కూడా. ఆ విషయం పక్కనపెడితే, బుట్టా రేణుకకి అఖిలపక్ష సమావేశం కోసం ఆహ్వానం పలకడం వెనుక బీజేపీ పెద్దలు పెద్ద వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది.