ఢిల్లీ వేదికగా ఏపి రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ చర్చకు అనుమతించటంతోనే రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. మామూలుగా అయితే టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ టేకప్ చేయదనే అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నోటీసును టేకప్ చేయటమే కాకుండా శుక్రవారమే లోక్ సభలో సభకు అనుమతించారు స్పీకర్.
ఏపికి రెండూ అన్యాయమే చేశాయి
ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి గడచిన నాలుగేళ్ళుగా టిడిపి, బిజెపిలు రెండూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయనటంలో సందేహం లేదు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి కాంగ్రెస్ అన్యాయం చేస్తే విభజన హామీలను అమలు చేయకుండా, పట్టించుకోకుండా బిజెపి, టిడిపిలు జనాలకు నమ్మకద్రోహం చేశాయి. జనాల ఆగ్రహాన్ని గమనించి, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు హటాత్తుగా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి కేంద్రంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే.
నిజంగా రెండు వైరిపక్షాలేనా ?
ఇక్కడే బిజెపి వ్యూహం అర్దం కావటం లేదు. ఎందుకంటే, అవిశ్వాసంపై చర్చంటూ జరిగితే బిజెపి, టిడిపిల బండారమే బయటపడుతుంది. నిజంగానే పై రెండు పార్టీలు వైరిపక్షాలైతే ఒకరి నిర్వాకాన్ని మరొకరు ఏకిపారేసుకోవాలి. కానీ అలా జరుగుతుందా ? అన్నది సందేహమే. ఇంతచిన్న విషయం స్పీకర్ కు తెలీకుండానే ఉంటుందా ? మరి, తెలిసి టిడిపి నోటీసుపై చర్చకు ఎందుకు అనుమతించారు ?
చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించిందా ?
బిజెపిలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించటం ద్వారా చంద్రబాబును బిజెపి ఉచ్చులోకి లాగిందట. నాలుగేళ్ళల్లో ఏపి అభివృద్ధికి కేంద్రం ఏమి చేసిందో వివరించి చెబుతుందట. అలాగే, చంద్రబాబు పాలనలోని అవినీతిని, ప్రత్యేకహోదాపై చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలను సభ సాక్షిగా దేశానికి చాటాలని నిర్ణయించుకుందట. ఇప్పటి వరకూ చంద్రబాబుకు వ్యతిరేకంగా రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన బిజెపి నేతల ఆరోపణలు సభ సాక్షిగా దేశం మొత్తానికి చాటాలని నిర్ణయించిందట.
బిజెపి మెటీరియల్ ను సిద్దం చేసుకుందా ?
చర్చలో బయటపెట్టాల్సిన మెటీరియల్ మొత్తాన్ని సేకరించిన తర్వాతనే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని బిజెపి ముఖ్యులు అనుకున్నారట. నిజానికి ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనని బిజెపి స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. అలాగని ఇవ్వనూ లేదు. హోదా స్ధానంలో ప్రత్యకప్యాకేజిని ప్రకటించింది. అభివృద్ధి, నిధులు, అవినీతిపై కొంతకాలంగా బిజెపి, టిడిపిల్లో ఎవరు చెబుతున్నది నిజమో జనాలకుఅర్ధం కావటం లేదు. కనీసం పార్లమెంటు వేదికగా అయినా రెండు పార్టీల వాదనల్లో ఎవరిది నిజమో తెలిస్తే అదే పదివేలు.