నరేంద్రమోడి సర్కార్ పై లోక్ సభలో మొదలైన అవిశ్వాస తీర్మానంపై బిజెపి ఎదురుదాడి మొదలుపెట్టింది. అయితే, టిడిపి తరపున చర్చను మొదలుపెట్టిన గల్లా జయదేవ్ ఆరోపణలు, ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పకుండా చర్చను పక్కదోవ పట్టిస్తోంది. గల్లా తర్వాత బిజెపి తరపున చర్చను మొదలుపెట్టిన రాకేష్ సింగ్ మాట్లాడుతూ, తన ప్రసంగం మొత్తాన్ని కాంగ్రెస్ పైనే కేంద్రీకరించటం గమనార్హం. మధ్య మధ్యలో టిడిపిపైన కూడా విమర్శలు చేశారనుకోండి అది వేరే సంగతి.
ఏపి విషయాలు తప్ప అన్నీ మాట్లాడారు
అవిశ్వాస తీర్మానం ముఖ్య ఉద్దేశ్యమే ఏపికి నాలుగేళ్ళలో జరిగిన అన్యాయాన్ని సభ ద్వారా యావత్ దేశం ముందుంచటం. గల్లా గంట ప్రసంగంలో ఆ విషయంలో చాలా వరకు సఫలమయ్యారనే చెప్పాలి. అయితే, తర్వాత మాట్లాడిన బిజెపి ఎంపి మాత్రం సరైన సమాధానాలు చెప్పటంలో విఫలమయ్యారనే చెప్పాలి. నాలుగేళ్ళల్లో ఏపి అభివృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించకపోగా టిడిపిపై రాజకీయవిమర్శలు మొదలుపెట్టారు.
బిజెపి, టిడిపిలు కలుసున్న విషయం మరచిన ఎంపి
అదే సమయంలో నాలుగేళ్ళల్లో మోడి సర్కార్ దేశానికి చేసిన సేవలన, అమలు చేస్తున్న పథకాలను, కాంగ్రెస్ హయాంలో బయటపడిన కుంభకోణాలను వివరించారు. ఎంపి ప్రసంగం విన్న వారికి అర్ధమైపోయింది బిజెపి వద్ద తగిన సమాధానాలు లేవని. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో టిడిపి ఎలా కలుస్తుందంటూ బిజెపి ఎంపి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఎందుకంటే, 2014లో జరిగిన రాష్ట్ర విభజన ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యం కాలేదు. బిజెపి, టిడిపిలు పూర్తి స్ధాయిలో మద్దతివ్వటం వల్లే రాష్ట్ర విభజన జరిగిన విషయాన్ని ఎంపి మరచిపోయారు. అలాగే, మొన్ని వరకూ బిజెపి, టిడిపిలు కలిసే ఉన్న విషయం కూడా ఎంపి మరచిపోవటం విచిత్రంగా ఉంది.
టిడిపికి శాపనార్దాలు
కాంగ్రెస్ తో చేతులు కలిపినపుడే టిడిపి శాపగ్రస్ధ అయిపోయిందట. కాంగ్రెస్ తో టిడిపి కలిసిపోయినందుకు కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి గరళం మింగుతున్నట్లే టిడిపికి కూడా గరళం మింగక తప్పదంటూ శాపనార్దాలు పెట్టటం గమనార్హం.