ప్రత్యేకహోదా సాధన కోసం చంద్రబాబునాయుడు తమ ఎంపిలతో రాజీనామాలు చేయించాలంటూ వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాదయాత్రలో భాగంగా కాకినాడలో జగన్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చ, పార్టీల స్పందన తదిరాలపై జగన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, టిడిపికి చెందిన ఎంపిలందరూ రాజీనామాలు చేసి నిరాహార దీక్షకు కూర్చోవాలని సూచించారు. ఇదే డిమాండ్ తో ఇప్పటికే తమ ఎంపిలు రాజీనామాలు చేసి నిరాహార దీక్షకు కూర్చున్న విషయాన్ని జగన్ గుర్తుచేశారు.
కేంద్రం మెడలు వంచుదాం
అదే విషయాన్ని విరిస్తూ, టిడిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే రాజీనామాలు చేసిన ఎంపిలందరూ నిరాహారదీక్షకు కూర్చుంటే కేంద్రం ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వదో చూద్దామని సవాలు విసిరారు. అంతమంది మాజీ ఎంపిలు నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో తేల్చుకుందామంటూ చెప్పారు. ప్రత్యేకహోదా డిమాండ్ కు మద్దతుగా చంద్రబాబు ఇతర పార్టీలను కలవటం కాదని, రాజీనామాలు చేసి నిరాహారదీక్షకు కూర్చుంటే దేశంలోని పార్టీలన్నీ మన దగ్గరకే వస్తాయని జగన్ సూచించారు.
బిల్డప్ లో కూడా నిజాయితీ లేదు
హోదా డిమాండ్ పై బిజెపి, టిడిపిలు చేస్తున్న అన్యాయానికి నిరసనగా వచ్చే మంగళవారం ఏపి బంద్ పాటించాలని జగన్ పిలుపిచ్చారు. బంద్ కు ప్రతీ పార్టీ, ప్రతీ సంఘం, వ్యాపార వర్గాలు సహకరించాలంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత చేయటానికి చంద్రబాబుకు ఏమీ మిగల్లేదంటూ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ళు సంసారం చేసినపుడు గుర్తుకురాని ప్రత్యేకహోదా హటాత్తుగా ఇపుడు గుర్తుకు వచ్చిందా అంటూ చంద్రబాబును నిలదీశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నట్లు మండిపడ్డారు. కనీసం ఆ బిల్డప్ లో కూడా నిజాయితీ లేదంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ధర్మపోరాటం ఉత్తిదే
అసలు ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. కేంద్రంపై చంద్రబాబు చెబుతున్న ధర్మపోరాటం కూడా ఉత్తిదేనంటూ తేల్చేశారు. తమకు చంద్రబాబు మంచి మిత్రుడని సభలో స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు పై ఒత్తిడి తేవటంలో భాగంగానే టిడిపి ఎంపిల రాజీనామాలకు పట్టుబట్టాలన్నారు.
బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి
ప్రత్యేకహోదా విషయంలో ఏపి ప్రజల సెంటిమెంటు, ఇవ్వనందుకు నిరసన కేంద్రానికి తెలియాలన్నారు. ఏపిని వంచించిన కాంగ్రెస్, బిజెపి. చంద్రబాబును నమ్మొద్దంటూ జనాలను జగన్ విజ్ఞప్తి చేశారు. హోదాకు మద్దతిచ్చే ఏ పార్టీకైనా సరే మద్దతు ఇస్తామంటూ మరోసారి స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకతో సభలో మాట్లాడించటంపై కూడా చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.