' అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులను దిద్దుకుంటున్నారు' అన్నది తెలుగులో పాపులర్ సామెత. కాంగ్రెస్ పార్టీ పరిస్దితి కూడా అలాగే ఉంది. అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ కూడా అందులో భాగమే. పచ్చగా కళకళలాడుతున్న ఏపిని అడ్డుగోలుగా విభజించారు. అవశేష ఏపి అన్నీ విధాల నాశనం అయిపోయింది. కనుచూపు మేరలో అభివృద్ధి చెందుతున్న నమ్మకం కూడా ఎవరిలోనూ లేదన్నది వాస్తవం. ఇటువంటి పరిస్దితుల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సిడబ్య్యూసి) సమావేశం ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ అధ్యక్షుడు రాహూల్ గాంధి హామీ ఇచ్చారు.
లోక్ సభలో మాట్లాడని రాహూల్
మొన్ననే లోక్ సభలో నరేంద్రమోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం సదర్భంగా జరిగిన చర్చలో రాహూల్ గాంధి మాట్లాడారు. దాదాపు గంటపాటు మాట్లాగిన రాహూల్ ఏపి సమస్యలు, ప్రత్యేకహోదా అంశంపై కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. సరే, తీర్మానానికి మద్దతుగా సంతకాలు పెట్టిన పార్టీల్లో ఏది కూడా మాట్లాడలేదనుకోండి అది వేరే సంగతి. మిగితా పార్టీలకన్నా కాంగ్రెస్ కే ఎక్కువ నైతిక బాధ్యతుందన్న విషయాన్ని ఎవరూ మరచిపోకూడదు.అందుకే అందరూ రాహూల్ ను తప్పు పట్టారు.
ఏపిపై కాంగ్రెస్ లో సానుభూతి
తన ప్రసంగంపై జాతీయ, ఏపి మీడియాలో వచ్చిన స్పందన బహుశా రాహూల్ దృష్టికి వెళ్ళిందేమో ? అందుకనే రిపేర్ సర్వీసుకు దిగారు. తాజాగా జరిగిన సిడిబ్ల్యూసి సమావేశంలో ఏపి సమస్యలకు ప్రధాన్యత ఇచ్చారు. హోదా విషయంలో ఒడిస్సా, బీహార్ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కూడా డిమాండ్ చేసినా రాహూల్ , సోనియాలు అడ్డుకున్నారట. విభజన తర్వాత నవ్యాంధ్ర చాలా నష్టపోయింది కాబట్టి ఏపికి ప్రత్యేకహోదా చాలా అవసరమంటూ తల్లీ, కొడుకులు వివరించారట. అభివృద్ధికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో ఏపిని పోల్చేందుకు లేదని కూడా వాళ్ళిద్దరూ స్పష్టం చేశారట. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విషయమై మాట్లాడవద్దంటూ అందరినీ కట్టడి చేశారట. కాంగ్రెస్ పరిస్దితి చూస్తుంటే ' అడుసు తొక్కనేల కాలు కడుగనేల ' అన్న సామెత గుర్తుకు రావటం లేదూ ?