వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటారా ? ఇపుడిదే అంశం పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ప్రత్యేకహోదా అంశంపై ఎవరైతే మద్దతు ఇస్తారో వారికి మద్దతు ఇవ్వటానికి అభ్యంతరం లేదంటూ జగన్ చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మొన్న కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో కూడా అదే విషయాన్ని జగన్ నొక్కి మరీ చెప్పారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో ఏపికి ప్రత్యేకహోదాపై స్పష్టమైన తీర్మానం చేసింది. మరి జగన్ ఇపుడేం చేస్తారు ?
కాంగ్రెస్ హామీపై చర్చ
ఈ అంశంపైనే అందరిలోనూ చర్చ మొదలైంది. హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వదలచుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడి పరోక్షంగా తేల్చిచెప్పేశారు. మొన్నటి లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చారు. దాదాపు గంటన్నర సేపు మాట్లాడిన మోడి ప్రత్యేకహోదా ఇస్తామన్న మాట చెప్పలేదు. ఎంతసేపు కాంగ్రెస్ లక్ష్యంగానే ప్రధాని స్పీచ్ సాగింది.
హోదా ఇస్తేనే మద్దతా ?
అదే సమయంలో చంద్రబాబును కూడా దుమ్ము దులిపేశారు. ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు ఒప్పుకోవటం వల్లే తాము ప్యాకేజి ప్రకటించామని చెప్పారే కానీ ఇప్పటి హోదా సెంటిమెంటును మోడి ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ నేపధ్యంలో ప్రత్యేకహోదాకు అనుకూలంగా కాంగ్రెస్ చేసిన తీర్మానం చేసింది. ఇదే విషయమై తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హోదా ఇచ్చిన వాళ్ళకే తమ మద్దతంటూ మెలికపెట్టారు. కేంద్రలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్న కాంగ్రెస్ తీర్మానాన్ని అయన పట్టించుకోలేదు.