వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ పార్టీ ఒకటే దిక్కా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వారికి అవుననే అనిపిస్తోంది. నరేంద్రమోడి ప్రభుత్వంపై టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఆ విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీల్లో ఏ ఒక్కటీ తర్వాత చంద్రబాబుకు మద్దతుగా నిలబడలేదన్న విషయం స్పష్టమైంది. టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాసానికి కూడా మద్దతు ఎందుకు ఇచ్చాయి ? ఎందుకంటే, నరేంద్రమోడి పై తమ అక్కసును వెళ్ళగక్కటానికి మాత్రమే.
కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపెట్టలేదు ?
మోడిపై అక్కసున్న చాలా పార్టీల్లో ఏవి కూడా ఇంతకాలం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే, అసలు నోటసు అడ్మిట్ అవ్వటానికి సరిపడా బలం వస్తుందా అని అనుమానంతో కావచ్చు, లేదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సినంత అవసరం లేదనీ అనుకోవచ్చు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లు అనుకుని ఉంటే మోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎందుకో అనుకోలేదు. అటువంటి పరిస్ధితుల్లోనే చంద్రబాబు హటాత్తుగా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
ఎవరి అజెండా వాళ్ళదే
మళ్ళీ ప్రస్తుత విషయానికి వస్తే, లోక్ సభ లో అవిశ్వాసం సందర్భంగా టిడిపికి మద్దతుగా ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా నిలవలేదు. చివరకు కొత్తగా బంధుత్వం కలిసిన కాంగ్రెస్ కూడా నిలవలేదు. నోటీసు ఇవ్వటానికి మద్దతు తెలిపిన పార్టీలు చర్చ సందర్భంగా ఎందుకు మద్దతుగా మాట్లాడలేదో అర్ధం కావటం లేదు. చర్చ మొదలైన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ తన సొంత అజెండా ప్రకారమే మాట్లాడేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి దాదాపు గంటసేపు మాట్లాడినా అందులో ఒక్క నిముషం కూడా ఏపి సమస్యలను ప్రస్తావించేందుకు కేటాయించలేదు. తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామన్న మాట కూడా చెప్పకపోవటం గమనార్హం.
చంద్రబాబుకు లభించని మద్దతు
జరిగిన పరిణామాలను గమనిస్తే జాతీయస్ధాయిలో ఒక్క పార్టీ కూడా చంద్రబాబు పూర్తిగా మద్దతు ఇవ్వటం లేదని అర్ధమైపోయింది. అంటే, ఎన్డీఏలో ఇమడలేక బయటకు వచ్చేసిన చంద్రబాబుకు అటు మోడి వ్యతిరేకుల నుండి కూడా మనస్పూర్తిగా మద్దతు లభించలేదు. అందుకే సభలో చంద్రబాబు ఒంటరైపోయారు. అవిశ్వాస తీర్మానంలో మోడి ప్రభుత్వాన్ని ఓడించటం సాధ్యంకాదన్న విషయం ముందే అందరికీ తెలుసు. అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం మోడి వ్యతిరేక పక్షాల్లో ఐకమత్యాన్ని చాటి చెప్పటమే అసలు ఉద్దేశ్యం. కానీ అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్లు గా తయారైంది చంద్రబాబు పరిస్ధితి.
చంద్రబాబుకు మిస్సై న మైలేజ్
నిజానికి మోడి వ్యతిరేక పార్టీల నేతలు కూడా లోక్ సభలో ఏపి సమస్యలపై కనీసం మొక్కబడిగా అయినా మాట్లాడుంటే పరిస్ధితి ఇపుడు ఇంకో విధంగా ఉండేదనటంలో సందేహం లేదు. మోడి వ్యతిరేకుల్లో జాతీయస్ధాయిలో చంద్రబాబుకు బాగా మైలేజ్ వచ్చుండేది. అప్పుడు టిడిపికి మద్దతుగి ఉండే మీడియా కూడా ఓ రేంజిలో రెచ్చిపోయేదనటంలో సందేహమే లేదు. కానీ టిడిపితో పాటు దానికి వత్తాసు పలికే మీడియా ఒకటనుకుంటే మరొకటి జరగటం అందులోనూ చివరగా మాట్లాడిన నరేంద్రమోడి తన ప్రసంగంలో పరువును సాంతం తీసేయటంతో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. మొత్తానికి తేలిందేమిటంటే కష్టమో నష్టమో చంద్రబాబుకు మిగిలింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని.