తెలుగుదేశంపార్టీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ముసుగు తొలగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారాన్ని కీలక నేతలెవరూ పెద్దగా ఖండిచలేదు. అలాగని నిజమనీ చెప్పలేదనుకోండి. కాకపోతే పొత్తులపై రెండు పార్టీల కీలక నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కుమ్మక్కు రాజకీయాలు ఏదో ఒక రూపంలో బయటపడుతున్నాయి.
ఒక్కో పార్టీది ఒక్కో వైఖరి
తాజాగా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రత్యేకహోదా డిమాండ్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈరోజు వైసిపి బంద్ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన బంద్ పిలుపు కాబట్టి అధికారంలో ఉన్న తెలుగుదేశం భగ్నం చేయటానికి ప్రయత్నించటం సహజం. అధికార, ప్రధాన ప్రతిపక్షాల వైఖరి ఈ విధంగా ఉంటే మిగిలిన ప్రతిపక్షాలేం చేస్తున్నట్లు ? వైసిపి బంద్ పిలుపుకు తాము సహకరించేది లేదని వామపక్షాలు స్పష్టంగా ప్రకటించాయి. ఇక, మిగిలింది బిజెపి, కాంగ్రెస్ పార్టీ, జనసేనలే.
హోదాపై రాహూల్ ఏం చెప్పారు ?
కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏనే కాబట్టి బిజెపి కూడా సహకరించదన్న విషయం తెలిసిందే. జనసేన వైఖరేంటో అధినేత పవన్ కల్యాణ్ బయటపెట్టలేదు. మరి, మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ? వైసిపికి సహకరించాలి. ఎందుకంటే, మొన్ననే కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత విధాన నిర్ణయాక వేదికైన సిడబ్ల్యూసి ప్రత్యేకహోదాకు అనుకూలంగా తీర్మానం చేసింది కాబట్టి. హోదా సాధన కోసం ఎంతటి పోరాటాలన్నా చేయాలని అధ్యక్షుడు రాహూల్ గాంధి స్పష్టంగా నేతలను ఆదేశించారు.
రఘువీరా ఏం చేస్తున్నారు ?
రాహూల్ ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ కూడా ఈరోజు బంద్ లో పాల్గొనాలి. వైసిపికి సహకరించటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేకాని చంద్రబాబుకు మద్దతుగా పిసిపి అధ్యక్షుడు రఘువీరారెడ్డి యాదవ్ మాట్లాడటమేంటి ? వైసిపి బంద్ పిలుపును తాము వ్యతిరేకమని రఘువీరా చెప్పటంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ, అందునా సిడబ్ల్యూసి తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబుతో చేతులు కలపటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
జనాల మనోభావలకు విరుద్ధంగా నిర్ణయమా ?
ఇక్కడే అందరిలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు మొదలైంది. రాహూల్ గాంధి ఆదేశాలకు, సిడబ్ల్యూసి తీర్మానానికి వ్యతిరేకంగా రఘువీరా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా ? రాహూల్ కు తెలియకుండానే పిసిపి అధ్యక్షుడు టిడిపి నిర్ణయానికి మద్దతుగా వ్యవహరించే అవకాశం ఉందా ? ప్రత్యేకహోదాపై జనాల మనోభావాలకు విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పరిస్దితేంటి ? అనే అనుమానాలకు కాంగ్రెస్ పార్టీనే సమాధానాలు చెప్పాల్సుంటుంది.