ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయడు ముందుకు పంచాయితీలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలో మైలవరం, గన్నవరం నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంఎల్ఏ వల్లభనేని వంశి పంచాయితీ కూడా చంద్రబాబు ముందుకు వచ్చింది. వీరిద్దరి పంచాయితీ ఈనాటిది కాదు. పంచాయితీ కూడా రైతలకు సంబంధించినదే కావటం, అందులోనూ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో పంచాయితీ కాస్తా పెద్దదైపోయింది. దాంతో పంచాయితీ కాస్త ఇపుడు చంద్రబాబుకు చుట్టుకున్నది.
మోటార్లతో నీళ్ళు తోడుకుంటున్న రైతులు
అసలేమైందంటే, జిల్లాలో పోలవరం కుడికాలువ తవ్వకానికి మైలవరం నియోజకవర్గం రైతుల లాగ గన్నవరం రైతులు కూడా భూములు ఇచ్చారు. భూములైతే ఇచ్చారు కానీ పంటలకు నీళ్ళు మాత్రం గన్నవరం రైతులు సరిగా అందుకోలేకున్నారు. దాంతో నీళ్ళ కోసం మోటార్లు పెట్టి తోడుకుంటున్నారు. ఆ విషయం కాస్త మంత్రి దేవినేని ఉమా దృష్టికి వెళ్ళటంతో ఆయనకు మండిపోయింది.
దేవినేని పై మండిపోతున్న ఎంఎల్ఏ
అసలే వంశీ అంటే మంత్రికి ఎప్పటి నుండో కోపముంది. ఇంకేముంది ? ఆ కోపాన్ని గన్నవరం రైతులపై చూపారు. పంటలకు నీళ్ళ కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను ఎత్తుకెళ్ళారు. దాంతో వంశీ మంత్రితో పాటు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. ఈ పంచాయితీ ఎంఎల్ఏ,మంత్రి, ఉన్నతాధికారుల మధ్య మూడేళ్ళుగా జరుగుతూనే ఉంది.
మైలవరంలోనూ అదే జరుగుతోంది
తాజాగా రెండు రోజుల క్రితం రైతుల మోటార్లను ఎత్తుకెళ్లిన అధికారులు మోటార్లు ఇవ్వటం లేదు. పోనీ కరెంటు ఛార్జీలు కట్టించుకుని కనెక్షన్లు ఇవ్వమంటే కుదరదంటున్నారు. పోనీ రైతుల వ్యవహారాలను చూసి చూడనట్లు వదిలేయమంటే సాధ్యం కాదంటున్నారు. గన్నవరంలో పోలవరం కాలువ కన్నా పంటభూముల ఎత్తు ఎక్కువగా ఉండటంతో కాల్వల్లో నుండి నీరు పొలాలకు అందటం లేదు. దాంతో వాళ్ళకందుబాటులో ఉన్న మార్గాన్ని రైతులు చూసుకున్నారు. విచిత్రమేమిటంటే, మంత్రి నియోజవర్గం మైలవరంలో కూడా రైతులు ఇదే పని చేస్తున్నారు. అధికారులు ఆ నియోజకవర్గం విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా ఒక్క గన్నవరం మీదే పడ్డరు. దాంతో పంచాయితీని ఎంఎల్ఏ చంద్రబాబు మెడకు చుట్టారు. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు వాళ్ళిద్దరినీ పిలిపించి మాట్లాడేందుకు రెడీ అయ్యారు. మరి, ఈ పంచాయితీ ఏ విధంగా ముగుస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.