ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ పవన్ పై జగన్ చేసిన కామెంట్స్. ఇరవై నాలుగు గంటలైనా మంటలు చల్లారడంలేదు, ఆ మంటలను మరింతగా పెంచేసి అందులో చలి కాచుకునేందుకు టీడీపీ మంత్రులు పడుతున్న పాట్లు, ఫీట్లు నవ్వు తెప్పించేవే. . ఒక్క చంద్రబాబు, ఆయన తనయుడు తప్ప మొత్తం మంత్రివర్గమంతా ఈ ఇష్యూపైనే రోజంతా గడిపేసింది. కామెంట్స్ ఎలా చేయాలో, చేయకూడదో కూడా జగన్ కు పాఠాలు చెప్పింది.
వ్యక్తిగత దూషణలు కూడదట :
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట రావు సూక్తులు వల్లే వేస్తున్నారు. రాజకీయాలలో ఒకరి జీవితాలలోకి మరొకరు తొంగి చూడరాదట. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావూ ఇలాగే సెలవిచ్చారు. పవన్ ని జగన్ అంత మాట అంటారా అంటూ ఓ లెవెల్లో బాధ పడ్డారు. ఇక జగన్ పై ఒంటికాలు మీద లేచే మంత్రి సోమిరెడ్డి అయితే జగన్ ని పవన్ విమర్శించింది కరెక్ట్. దానికి జగన్ రియాక్షన్ రాంగ్ అంటూ తీర్పు ఇచ్చేశారు. చూశావా పవన్, చంద్రబాబుకు, జగన్ కి ఉన్న తేడా అంటూ కొత్త పోలిక కూడా తెచ్చారు.
నిన్నటి వరకు చేసింది అదే కదా :
నిజమే వ్యక్తిగత దూషణలు ఎవరూ చేయకూడదు, కానీ నిన్నటి వరకు టీడీపీలో ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, నాయకులు చేస్తూ వస్తున్న విమర్శల సంగతేంటి. జగన్ ని అనలేని మాటలెన్నో అన్నది వీరే కదా. ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాదు. తాత, ముత్తాతలను కూడా ముగ్గులోకి తెచ్చి మరీ తిట్టిందీ ఈ నోళ్ళే కదా. ఇపుడు మాత్రం మర్యాద రామన్నకే అన్నల్లా తీర్పులు చెబుతున్నారు.
నిజానికి ఏపీలో రాజకీయ వాతారవరణం బాగా దిగజారిపోవడానికి అన్ని పార్టీలూ కారణం అంటే సబబుగా ఉంటుంది. ఇపుడు దొరికింది కదా అని అనేయడం కాదు. రేపు బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి వాళ్ళు, ఈ మంత్రులు నిజంగా సిధ్ధాంతాల మీదనే కామెంట్స్ చేస్తే అపుడు ఈ చెప్పిన సుద్దులకూ విలువిచ్చిన రోజు, అదే ఏపీ జనాలకు అసలైన పండుగ రోజు.