ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు ప్రత్యేక హోదా అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టీడీపీల మధ్య ఈ అంశం గురించి పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది. అసలు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో ముందు నుంచి చిత్తశుద్ధితో పోరాడిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఇదిలావుండగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా పిలిచే కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ స్పెషల్ స్టేటస్ పై సంచలన కామెంట్స్ చేసారు...రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రదాన అజెండాగా ఉండనుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతుందన్నారు.
రాబోయే యూపీఏ ప్రభుత్వం ఏపీకి హోదా ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని గతంలో చెబితే తనను అందరూ హేళన చేశారన్నారు. బీజేపీ మొదటి నుంచీ అబద్ధాలు చెబుతుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో మరోసారి ప్రైవేటు బిల్లు పెట్టానని, ఈ బిల్లు చర్చకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో రావలసిన విషయమని...కానీ ఇప్పటివరకు రాకుండా ఉండటానికి గల పెద్ద కారణం చంద్రబాబు అని బాబుపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరాష్ట్రంలో కచ్చితంగా తన ఉనికిని నిలబెట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.