దిగజారిపోయిన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని కలెక్టర్లు, ఉన్నతాధికారులు కాపాడగలరా ? చంద్రబాబునాయుడు ఆలోచన చూస్తుంటే అలాగే నమ్మకం పెట్టుకున్నట్లు కనబడుతోంది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారట. వచ్చే ఎన్నికల్లో టిడిపి తిరిగి అధికారంలోకి వచ్చేట్లుగా సహకరించాలని అభ్యర్ధించినట్లు వైసిపి మీడియా చెబుతోంది. క్షేత్రస్ధాయిలో దిగజారిపోయిన ప్రభుత్వ ప్రతిష్టను అధిగమించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారట. తమకు సహకరించేవారిని తమ ప్రభుత్వం గుర్తుంచుకుంటుందనే భరోసా కూడా ఇచ్చారట. చంద్రబాబు పిచ్చిగాని కలెక్టర్లు, ఎస్పీలు పార్టీలను అధికారంలోకి తేగలిగితే ఇక, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలెందుకు ? పార్టీ యంత్రాంగమంతా ఎందుకు ?
15 రోజులకో నివేదిక
అదే సమయంలో జిల్లాల వారీగా ఎంఎల్ఏలు, సీనియర్ నేతల పనితీరుపై కలెక్టర్లను నివేదికలను ఇవ్వాల్సిందిగా అడిగారట. ప్రతీ 15 రోజులకు ఒక రహస్య నివేదికను ఇవ్వమని చంద్రబాబు కోరారట. జిల్లాల్లో ఓటరును యూనిట్ గా తీసుకుని ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లే నేరుగా ప్రచారం చేయాలట. అందుకు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారట. అంగన్ వాడి వర్కర్లు, టీచర్లు, ఆశా వర్కర్లు లాంటి వాళ్ళందరికీ జీతాలు పెంచిన కారణంగా వారందరిచేత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయించాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపైనే ఉందన్నారు.
టిడిపిని గెలిపించే బాధ్యత కలెక్టర్లదేనా ?
రాబోయే కాలం టిడిపికి చాలా కీలకం కాబట్టి ప్రభుత్వ పథకాలపై బాగా ప్రచారం జరిగేట్లు కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తిరిగి అధికారంలోకి రావాలంటే ఏమేమి చేయాలో సూచించాలని కూడా కలెక్టర్లను కోరారు. క్షేత్రస్ధాయిలో పనిచేసే కీలక ఉద్యోగులను ఎంపిక చేసేటపుడు టిడిపికి అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేయాలంటూ కలెక్టర్లను ఆదేశించారట. అంటే టిడిపి కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళని నియమిచాలని చంద్రబాబు ఉద్దేశ్యం కాబోలు. సరే, ప్రభుత్వ యంత్రాంగం టిడిపికి సహకరిస్తుందా లేదా అన్నది వేరే సంగతి.
జనాల గోడు పట్టించుకోరా ?
అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు ఒక విషయం మరచిపోయినట్లున్నారు. 2003లో కూడా చంద్రబాబుకు ఇదే పరిస్ధితి ఉండేది. అప్పట్లో కూడా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు కీలక స్ధానాల్లో తమ సానుభూతిపరులనే నియమించుకున్నారు. దానికితోడు అలిపిరిలో జరిగిన మావోయిస్టుల హత్యాయత్నం సానుభూతి. అన్నీ కలిపి తమను మళ్ళీ సిఎం పీఠంపై కూర్చోబెడుతుందనే చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తీరా చూస్తే జరిగిందేమిటి ? చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అంటే చంద్రబాబు పాలనపై జనాలు ఏ స్ధాయిలో విసిగిపోయారో అర్ధం చేసుకోవాలి.
2003 నాటి పరిస్ధితులేనా ?
పోయిన ఎన్నికల్లో ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఇక, ప్రభుత్వంలో ఏ స్ధాయిలో అవినీతి పెరిగిపోయిందో అందరూ చూస్తున్నదే. శాంతి, భద్రతల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. విభజన చట్టాన్ని అమలు చేసేట్లు కేంద్రంపై ఒత్తిడి తేవటంలో విఫలమయ్యారు. చివరకు ప్రత్యేకహోదాపై ఎన్నిసార్లు పిల్లిమొగ్గలు వేసిందీ అందరూ చూస్తున్నదే. ఒకవిధంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అన్నింటా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అందుకే ఇపుడు కూడా 2003 నాటి పరిస్ధితులే కనబడుతున్నాయని స్వయంగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జనాలు ఓట్లేస్తే అధికారం వస్తుంది కానీ కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు చంద్రబాబును సిఎం చేయగలరా ?