చంద్రబాబునాయుడు కాపుల రిజర్వేషన్ పై మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. లోక్ సభలో కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ ఎంపిలను చంద్రబాబు ఈరోజు ఆదేశించారు. కాపుల రిజర్వేషన్ వ్యవహారం ఇంతగా కంపు అవ్వటానికి చంద్రబాబే కారణమని చెప్పకతప్పదు. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాపులను బిసి రిజర్వేషన్లలో కలుపుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించటమన్నది చంద్రబాబు చేతిలో లేని అంశం. అయినా కానీ హామీ ఇచ్చేశారు. సరే, తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
జగన్ ప్రకటనే కారణం
కాపులకు రిజర్వేషన్ అంశంపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. అటువంటిది తాజాగా ఈరోజే ఎందుకు మాట్లాడారు ? అంటే, జగన్ చేసిన ప్రకటనే కారణమని చెప్పాలి. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్ కల్పించటం తన చేతిలో లేని అంశమని స్పష్టం చేశారు. అంటే కాపుల రిజర్వేషన్ పై జగన్ ఒక విధంగా చేతులెత్తేసినట్లే. జగన్ ప్రకటనపై కాపుల్లో కూడా వ్యతిరేకత బాగా కనబడుతోంది. దాంతో పరిస్దితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు చంద్రబాబు చురుగ్గా పావులు కదపటం మొదలుపెట్టారు.
చంద్రబాబు తాజా ఎత్తులు
ఈ రోజు ఉదయం ఎంపిలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రిజర్వేషన్లకు అనుకూలంగా గతంలో మంత్రివర్గంలో తర్వాత అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో పెడుతూ కాపులకు లబ్ది చేకూర్చే విధంగా ఎంపిలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. లోక్ సభలో కాపుల గురించి టిడిపి మాట్లాడినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో లబ్ది కలుగుతుందా అంటే చెప్పటం కష్టమే. కానీ కాపులతా పవన్ కు దూరమని జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తాజా ఎత్తులు మొదలు పెట్టారన్నది మాత్ర తెలిసిపోతోంది.