అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. ఆర్ధికశాఖ మంత్రి యనమల రామృష్ణుడు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పాలుపోశారు. నాలుగు రోజుల క్రితం కాపులకు రిజర్వేషన్ కల్పించటం రాష్ట్రపరిధిలోని అంశం కాదని జగన్ అన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశానికి తాను హామీ ఇచ్చి జనాలను మోసం చేయనని కూడా స్పష్టంగా చెప్పారు.
జగన్ చెప్పింది నిజమే
కాపు రిజర్వేషన్లకు సంబంధించి జగన్ చెప్పిందాంట్లో అబద్దమేమీ లేదు. అయితే, రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబునాయుడు పీకల్లోతుల్లో ఇరుక్కుపోయారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోగా కాపులకు బిసి రిజర్వేషన్లను వర్తింపచేస్తానంటూ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా విషయాల్లో మాట తప్పినట్లే ఈ విషయంలో కూడా మాటతప్పారు. కాకపోతే కాపు సామాజికివర్గాన్ని బిసిల్లో చేర్చటమన్నది చాలా సున్నితమైన అంశం.
జగన్ ను వెంటాడిన టిడిపి మీడియా
ఎప్పుడైతే చంద్రబాబు మాట తప్పారో కాపులు రోడ్డెక్కారు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే. మొన్న జగ్గంపేట బహిరంగ సభలో జగన్ రిజర్వేషన్లపై తన వైఖరేంటో స్పష్టం చేశారు. వెంటనే చంద్రబాబు అండ్ కో యాక్టివేట్ అయిపోయారు. జగన్ యు టర్న్ తీసుకున్నారంటూ దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. కాపులకు రిజర్వేషన్ కల్పించటాన్ని జగన్ వ్యతిరేకమంటూ ఊదరగొట్టటం మొదలుపెట్టారు. టిడిపికి మద్దతిచ్చే మీడియా కూడా జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వండివారుస్తున్నాయి. ఏ చిన్న విషయం జగన్ కు వ్యతిరేకంగా దొరికినా దాన్ని చంద్రబాబుకు అనుకూలంగా మలచటమే సదరు మీడియా లక్ష్యం.
జగన్ కు మద్దతుగా యనమల
టిడిపి నేతలు, మీడియా తమ ప్రణాళికను అమల్లో పెడుతుండగానే యనమల ఓ సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే, కాపులకు రిజర్వేషన్లు కల్పించటమన్నది రాష్ట్రం పరిధిలోని లేదన్నారు. రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్రపరిధిలోనిదన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని తేల్చేశారు. నిజానికి యనమల చెప్పిందాంట్లో కొత్త విషయమేమీ లేదు. కాకపోతే నాలుగు రోజుల క్రితం జగన్ చెప్పిన విషయాన్నే యనమల చెప్పటంతో జగన్ వాదనకు మద్దతుగా మాట్లాడినట్లైంది.
మోసగాడంటూ దుమ్ముదులిపేసిన జగన్
ఒకవిధంగా జగన్ ప్రకటన తర్వాత టిడిపి నేతలు, టిడిపి మీడియా చేసే ఎదురుదాడిని తట్టుకోవటానికి వైసిపి నేతలు చాలా అవస్తలు పడ్డారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న సమయంలో జగన్ కు వ్యతిరేకంగా టిడిపి మీడియా దాడిని ఎలా ఎదుర్కోవాలో వైసిపి నేతలకు అర్దం కాలేదు. జగన్ కూడా ఆ విషయమై మూడు రోజులుగా ఎక్కడా మాట్లాడలేదు. అటువంటి సమయంలో యనమల చేసిన ప్రకటన వైసిపి నెత్తిన పాలు పోసినట్లైంది. దాంతో రెచ్చిపోయిన జగన్ పిఠాపురం సభలో చంద్రబాబును దుమ్ముదులిపేశారు. దాంతో ఇపుడు టిడిపినే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. ఇపుడు చెప్పండి జగన్ కు యనమల ఎంత సాయం చేశారో ?