ఏపీలో ప్రతీ నిరుద్యోగ యువకుడికీ జాబ్ అయినా ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భ్రుతి అయినా ఇస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ళు దాటుతోంది. మరో ఏడెనిమిది నెలలలో ఎన్నికలు వస్తున్నాయనగానే ఇపుడు ఉన్నట్టుంది చంద్రబాబుకు ఏపేలో నిరుద్యోగులు గుర్తుకువచ్చారు. దాంతో నిరుద్యోగ భ్రుతి పాట అందుకున్నారు. అదీ మార్చి బడ్జెట్లో పెట్టి అమలు చేయడానికి ఆరు నెలలు పట్టింది. మొత్తానికి ఏపీలో నిరుద్యోగికి వేయి రూపాయలు ఇస్తారట. పండగ చేసుకో మంటున్నారు.
ఎన్నో షరతులు :
ఆ వేయి రూపాయలకూ ఎన్నో షరతులు వరిస్తాయి మళ్ళీ. ప్రజా సాధికారిక సర్వేలో రిజిష్టర్ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళే అర్హులు. అంతేనా. వయసు 25 నుంచి 35 మధ్యన ఉండాలట. ఆధార్ కార్డ్ తో లింకప్ ఎటూ ఉంది. పీఎఫ్ వచ్చే జాబ్ చేయరాదు. అంటే ఆవారాగా గాలి తిరుగుడు తిరిగే వాళ్ళకే ఈ భ్రుతి అన్న మాట. అలా తిరిగే వాళ్ళకు వేయి ఏం సరిపోతుందని అడిగితే వాళ్ళకూ ఖర్చులు ఉంటాయిగా అంటున్నారు మంత్రి లోకేష్ మరి, ఏం ఖర్చులో, సర్కార్ ఏం ఆదుకుంటుందో చూడాలి.
ప్రపంచంలోనేనట :
ప్రపంచంలోనే ఈ టైప్ స్కీం ఎక్కడా లేదని గప్పాలు కొట్టుకున్నారు మంత్రి లోకేష్. మా ముందూ తరువాతా ఎవరూ చేయలేరని కూడా చెప్పుకొచ్చారు. మంచిదే కానీ రెండు వేలు ఇస్తానని చెప్పి వేయి ఇవ్వడమేంటని అడిగితే వేయి ఇస్తే చాలని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పిందట. అవ్వా తాతాల మాదిరిగా పెన్షన్ లా భ్రుతి ఇస్తామని చెప్పడానికి మంత్రికి ఏం అనిపించకపోవచ్చు కానీ, రక్తం మరిగే యువతకు జాబ్స్ ఇవ్వకుండా ఇలా జవసత్వాలు ఉడిగిపోయిన వారితో సమానం చేశామని ప్రభుత్వం చెబుతూంటే వినడానికే బాధగా ఉంది.
నిజానికి నాలుగున్నరేళ్ళలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం నిజంగా అవి వచ్చుంటే ఈ భ్రుతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా నిజం చెబితే బాగుంటుంది. ఇక ఈ నిరుద్యోగ భ్రుతి పేరిట డేటాను కలెక్ట్ చేసుకుని రేపటి ఎన్నికలలో అధికార పార్టీ సానుభూతిపరులుగా యువతను మార్చుకోవడానికి యూజ్ చేసుకునేందుకూ ఈ స్కీం ని అడ్డంపెట్టుకుంటున్నారనిపిస్తోంది.