ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దూకుడు పెంచుతోంది. వివిధ సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదంతోనే కేంద్రం దూకుడు పెంచుతోంది. లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల్లో చాలా వాటిల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. నిధుల విషయంలో ఎక్కువ భాగం కేంద్రాం వాటానే అనటంలో సందేహం లేదు. అటువంటిది కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్రాల వాటాలో కలిపేసి పథకాలు, నిధులు అన్నీ తమవిగానే చెప్పుకుంటుంటాయి రాష్ట్రప్రభుత్వాలు. ఏపిలో చంద్రబాబునాయుడు కూడా అదే విధంగా చేస్తున్నారు.
పథకాల్లో ఎక్కువ నిధులు కేంద్రానివే
బిజెపి, చంద్రబాబునాయుడు కలిసి కాపురం చేసినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. అప్పటి వరకూ కేంద్రం మంజూరు చేస్తున్న నిధులతో చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గృహనిర్మాణ పథకం, వివిధ రకాల ఫించన్లు, చౌకదుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న నిత్యావసరాలు, ఉపాధి హామీ పథకం, నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఆరోగ్య మిషన్, చంద్రన్న బీమా పథకం లాంటి అనేక పథకాల అమల్లో ఎక్కువ భాగం నిధులు కేంద్రానివే. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నారంటే పథకాలన్నీ తనవే అని, నిధులు కూడా తానే మంజూరు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు.
హోర్డింగులు పెట్టాల్సిందే
పథకాల ప్రచారంలో కూడా ఎక్కడా కేంద్రప్రభుత్వం అని కానీ లేకపోతే ప్రధానమంత్రి, సంబంధిత కేంద్రమంత్రుల ఫొటోలు కానీ కనిపించకుండా చేస్తున్నారు. ఈ విషయమై గతంలోనే బిజెపి రాష్ట్ర నేతలు అభ్యంతరాలు లేవనెత్తినా చంద్రబాబు లెక్క చేయలేదు. ఎప్పుడైతే రెండు పార్టీలు విడాకులు తీసుకున్నాయో అప్పటి నుండి సీన్ రివర్స్ అవ్వటం మొదలైంది. సంక్షేమ పథకాల అమల్లో కేంద్ర పథకాలేవి, రాష్ట్ర పథకాలేవి, ఏ పథకానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తోందన్న వివరాలను కేంద్రమే పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి జనాలకు చెబుతోంది. ఇది ఒకరకంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే.
నిధులపై లెక్కలు తేలాల్సిందే
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ప్రచార దూకుడును మరింత పెంచాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. అందుకే కేంద్ర పథకాలు, నిధుల మంజూరు ప్రకటనలు ప్రతీ గ్రామంలోనూ కనబడేట్లు పెద్ద హోర్డింగులు పెట్టాలంటూ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అంటే ఇంతకాలం చంద్రబాబు చెబుతున్నవి అబద్దాలే అని నిరూపించటమే కేంద్రం లక్ష్యంగా కనబడుతోంది. ఆ విషయంలో టిడిపి నేతలు కూడా చేయగలిగేది ఏమీ ఉండదు. అంతేకాకుండా ఇప్పటి వరకూ రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల వివరాలను కూడా ప్రకటించాలని కలెక్టర్లను కేంద్రం ఆదేశించటమే చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. కేంద్రం తాజా ఆదేశాలపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.