చంద్రబాబునాయుడు పాలనలోని పథకాల అమలును చూసిన తర్వాత అందరిలోనూ ఈ పథకం అమలుపై సందేహాలు మొదలయ్యాయి. వచ్చే నెల నుండి నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. నిజానికి నిరుద్యోగ భృతి అన్నది పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ. 2014లో ఇచ్చిన హమీని 2018లో అంటే సరిగ్గా మళ్ళీ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు అమల్లోకి తెస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో లబ్దికోసమే ఇపుడు పథకం అమలు చేస్తున్నారన్నది వాస్తవం.
పథకం అమలుపై అనుమానాలు
ఇక్కడే ఈ పథకం అమలుపై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే, చంద్రబాబు ఇప్పటి వరకూ అమలు చేసిన చాలా పథకాలు తప్పుల తడకలే. చాలా పథకాల్లో అవినీతి, అక్రమాలే చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు చూస్తే గృహనిర్మాణ పథకం, కొన్ని చోట్ల ఇళ్ళ స్ధలాల పంపిణి, రైతులకు ట్రాక్టర్ల పంపిణీ, ఎస్సీ, బిసి, కాపులకు రుణాల పంపిణీ లాంటి వాటిల్లో నిజమైన అర్హులకన్నా టిడిపి మద్దతుదారులు, సానుభూతిపరులకే ఎక్కవ లబ్ది అందుతోనే అరోపణలు వింటున్నదే.
లబ్దిదారుల జాబితా ప్రకటిస్తారా ?
అందుకనే వచ్చే నెలలో మొదలవ్వనున్న నిరుద్యోగభృతిపైన కూడా అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే నెల నుండి రాష్ట్రంలోని 12 లక్షల నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో లబ్దిదారులుగా ఎక్కువ భాగం టిడిపిలో పనిచేసే కార్యకర్తలు, సానుభూతిపరులనే ఎంపిక చేస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అర్హులకే నిజమైన లబ్ది అందాలంటే లబ్దిదారుల జాబితాను ప్రతినెల బహిరంగంగా ప్రకటిస్తే బాగుంటుంది. అదే విధంగా ఆధార్ కార్డుతో లబ్దిదారుల వివరాలను అనుసంధానం చేస్తేనే పథకం అమలులో పారదర్శకత ఉంటుంది. లేకపోతే జనాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది.