వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూమ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏమిటా పరిణామాలంటే, తాజాగా బయటపడిన ఓట్ల గల్లంతు. గల్లంతైన ఓట్లు ఏవో వందలు కాదు సుమా ! రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పటికి బయటపడిన దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఓట్లు గల్లంతయ్యాయట. అందులో మెజారిటీ ఓట్లు వైసిపి మద్దతుదారులవే అనే ప్రచారం మొదలైంది.
చాలా కాలంగానే గల్లంతవుతున్న ఓట్లు
ఓట్ల గల్లంతు అన్నది ఇప్పటికిప్పుడు జరిగిన విషయం కాదు. సుమారు ఏడాది క్రితం నుండే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. అప్పట్లో కూడా గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో వైసిపి మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతయ్యాయంటూ గోల జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ విషయం చప్పబడిపోయింది. మళ్ళీ ఇంత కాలానికి వివాదం రేగింది. ఎక్కడైనా కొత్త ఓటర్లు చేరటం వల్ల నియోజకవర్గంలోని ఓట్లు పెరుగుతాయి. కానీ ఇదేం విచిత్రమో లక్షల్లో తగ్గిపోతున్నాయి.
సుమారు 10 లక్షల ఓట్లు మాయమైపోయాట
బయటకు వచ్చిన వివరాల ప్రకారం కడప జిల్లాలో సుమారు 3 లక్షల ఓట్లు మాయమైపోయాయి. అందులో ఒక్క కడప కేంద్రంలోనే సుమారు 1.10 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. విచిత్రమేమిటంటే కడప కార్పొరేషన్లోని వైసిపికి చెందిన 12 మంది కార్పొరేటర్ల ఓట్లు కూడా గల్లంతయిపోవటం. ఇక, కర్నూలు జిల్లాలో కూడా 3 లక్షల ఓట్లు మాయమైపోయాయట. పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, కోడుమూరు, ఆదోని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్లు పోయాయి. ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో 30.56 లక్షల ఓట్లుంటే తాజాగా ఆ సంఖ్య 27.56 లక్షలకు పడిపోయాయి. అలాగే, కృష్ణా జిల్లాలో 3.19 లక్షలు, చిత్తూరు జిల్లాలో 2.5 లక్షల ఓట్లు, నెల్లూరు జిల్లాలో 2 లక్షల ఓట్ల చొప్పున గల్లంతైపోయాయి. ఇతర జిల్లాల్లో ఇంకా ఎన్ని లక్షల ఓట్లు మాయమైపోయాయో తెలీదు.
వైసిపి లక్ష్యంగానే గల్లంతయ్యాయా ?
సరే, ఓట్లు గల్లంతవ్వటం, తర్వాత చేర్చటం అన్నది సాధారణ ప్రక్రియే. అయితే, ఒకేసారి అన్ని లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయి ? అధికారంలోని పార్టీ ప్రోద్బలం లేకుండానే ఏకంగా లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా గల్లంతైన ఓట్లన్నీ కచ్చితంగా వైసిపికి బాగా పట్టున్న నియోజకవర్గాలు, మద్దతుదారులు లేదా సానుభూతిపరులవే అనే ప్రచారం జరుగుతుందటం గమనార్హం. అంటే, వైసిపి ఓట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగించారని అనుమానించాల్సుంటుంది. ఓట్లను తొలగించటమన్నది అధికారంలోని టిడిపికి తప్ప సాధ్యం కాదు.
టిడిపి వ్యూహంలో భాగమేనా ?
విచిత్రమేమిటంటే ఓట్లను ఏకపక్షంగా తొలగించేస్తున్న అధికారులు ఓట్లు కావాలంటే మళ్ళీ ఎన్రోల్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. ఓట్లను తొలగించేముందు కనీసం సర్వే కూడా చేయలేదు. వైసిపికి పెరుగుతున్న ఆధరణ ఒకవైపు చంద్రబాబు పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత ఇంకోవైపు, వెరసి టిడిపిలో ఆందోళన పెరిగిపోతున్నట్లు అర్దమవుతోంది. రేపటి ఎన్నికల్లో ఎటుపోయి ఎటువస్తుందో అన్నట్లుగా ముందు జాగ్రత్తగా వైసిపి ఓట్లను లేపేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇపుడు గనుక వైసిపి నేతలు మేల్కొని తొలగించిన ఓట్లను మళ్ళీ ఎన్రోలు చేయించకపోతే అంతే సంగతులు.