జీవీఎల్ ఆరోపణలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ వేలసంఖ్యలో పీడీ ఖాతాలు తెరవడం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో మాత్రమే పీడీ అకౌంట్స్ ఉన్నాయన్నారు. మరి రాష్ట్రంలో ఇన్ని అకౌంట్స్ ఎందుకు తెరిచారని ఆయన ప్రశ్నించారు. ఇది చిన్న కుంభకోణం కాదని, 2జీ స్కాం తరహాలో పెద్ద కుంభకోణమని బీజేపీ నేతలే అంటున్నారని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారని, మరి ఎందుకు సీబీఐ విచారణ జరిపేందుకు బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారని అంబటి సూటిగా ప్రశ్నించారు.
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత రాష్ర్టానికి నిధులు, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకోవడం చూశాం. కానీ జీవీఎల్ ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. రూ.53 వేలకోట్లకు సంబంధించిన కుంభకోణం నిజమైతే కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో సీబీఐ విచారణ జరిపించేందుకు ఎందుకు జంకుతున్నట్టు అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.