అక్రమంగా సాగుతున్న క్వారీలను జనసేన కార్యకర్తలే నిలిపేస్తారంటూ పవన్ కల్యాణ్ సంచలన హెచ్చరిక చేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలోని హత్తి బెలగళ్ళ కొండల్లో జరుగుతున్న కంకర క్వారీలను సందర్శించారు. మూడు రోజుల క్రితం క్వారీలో జరిగిన ఓ ప్రమాదంలో 12 మంది కూలీలు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా క్వారీని పరిశీలించేందుకు పవన్ ఈరోజు కర్నూలుకు వచ్చారు.
క్వారీయింగ్ వెంటనే నిలిపేయాలి
క్వారీయింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన తర్వాత ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న బాధితులను కరూడా పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అక్రమంగా జరుగుతున్న క్వారీయింగ్ ను వెంటనే ప్రభుత్వం నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం గనుక ఆ పని చేయకపోతే జనసేన కార్యకర్తలే అక్రమ క్వారీయింగ్ ను నిలిపేస్తారంటూ సంచలన ప్రకటన చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటే గనుల శాఖ మంత్రి నిద్రపోతున్నారా ? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పవన్ న్నే దిగ్బందించిన అభిమానులు
అంతుకుముందు కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. పేలుళ్ళు జరిగిన క్వారీయింగ్ ప్రాంతాన్ని చూడటానికి పవన్ కొండల ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, పవన్ ను క్వారీల వద్దకు వెళ్ళకుండా అభిమానులు అడ్డుకున్నారు. పవన్ ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నిలిపేశారు. అభిమానం వెర్రిపుంతలు తొక్కటంతో పవన్ కు అభిమానుల నుండే చేదు అనుభవం ఎదురైంది. ఎంత సేపు చెప్పినా అభిమానులు వినకపోవటంతో, పోలీసులు జోక్యం చేసుకున్న అభిమానులు లెక్క చేయకపోవటంతో చేసేది లేక పవన్ వెనక్కు తిరిగారు.