చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయాలు విచిత్రం ఉంటోంది. అన్న క్యాంటిన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అన్న క్యాంటిన్లను పెట్టిందే పేదల ఆకలి తీర్చటం కోసం. అటువంటిది మళ్ళీ ఆదివారం మూసేయటమేంటి ? ఎందుకు మూసేశారంటే ఆదివారమట. పైగా ఆదివారం అన్న క్యాంటిన్లకు సెలవంటూ ఓ సర్క్యులర్ కూడా క్యాంటిన్ ముందు అంటించటం విచిత్రంగా ఉంది.
క్యాంటిన్లపై ఆనేక ఆరోపణలు
అసలే, క్యాంటిన్ల నిర్వహణపై అనేక ఆరోపణలు, విమర్శలు వినబడుతున్నాయి. రెండు గదుల క్యాంటిన్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. రూ. 15 లక్షల్లో అయిపోయే నిర్మాణానికి ప్రభుత్వం ఏకంగా రూ. 45 లక్షలు వ్యయం చేసిందట. అలాగే, భొజనం విషయంలో కూడా ప్లేటుకు ప్రభుత్వం రూ. 60 రూపాయలు ఇస్తోందట. పక్కనున్న తెలంగాణాలో దాదాపు అదే భోజనానికి ప్లేటుకు ఇస్తున్నది కేవలం 20 రూపాయలు మాత్రమేనట. పైగా ఓ వందమందికి పెట్టగానే భోజనం అయిపోయిందని చాలా క్యాంటిన్లు మూసేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.
చెడ్డపేరు చంద్రబాబుకే
ఇన్ని ఆరోపణలు, విమర్శల మధ్య ఏదో మొక్కుబడిగా జరుగుతున్న క్యాంటిన్లను ఆదివారం సెలవు పేరుతో మూసేయటం వివాదాస్పదమైంది. మరి ఒక్క క్యాంటిన్ నే మూసేశారా ? లేకపోతే అన్నీ క్యాంటిన్లనూ మూసేశారా అన్నది తేలలేదు. అదే విధంగా క్యాంటిన్ ను మూసేయటం కాంట్రాక్టర్ సొంత నిర్ణయమా ? లేకపోతే ప్రభుత్వం ఆదేశాల మేరకే మూసేశారా అన్నది కూడా తేలాలి. ఎందుకంటే, ఈ రోజు ఆదివారమని మూసేశారు. రేపటి నుండి ప్రతీ ప్రభుత్వ సెలవు రోజునా క్యాంటిన్ మూతపడుతుందేమో ? అయినా ఆకలికి ఆదివారమేంటి ? సోమవారమేంటి ? ఇక అన్న క్యాంటిన్లు పెట్టి ఉపయోగమేంటి ? మొత్తానికి ఎలా జరిగినా వచ్చే చెడ్డపేరు మాత్రం చంద్రబాబుకే కదా ?