మొత్తానికి భవిష్యత్తు పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంపార్టీలు చేతులు కలిపాయి. ఈరోజు జరుగనున్న రాజ్యసభ డిప్యుగి ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ అభ్యర్ధి బి కె హరి ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబునాయుడ నిర్ణయించారు. యూపిఏ అభ్యర్ధికే టిడిపి ఓటు వేస్తుందని అందరూ అనుకుంటున్నదే. కాకపోతే అధికారికంగా మాత్రం నిన్న రాత్రి చంద్రబాబు ప్రకటించారు. దాంతో రెండు పార్టీల భవిష్యత్ పొత్తులకు మార్గం ఏర్పడినట్లైంది.
భవిష్యత్ పొత్తులకు సంకేతాలు
రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది పెద్ద విషయం కాదు. కానీ ఆ కారణంగా కాంగ్రెస్ , టిడిపిలు రెండు ఏకమవ్వటమే గమనార్హం. అసలు తెలుగుదేశంపార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత మీద. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ ఉన్నంత కాలం ఏ దశలోనూ ఏ అంశంలోనూ కాంగ్రెస్ తో చేతులు కలిపిన దాఖలు లేవు. అసలు టిడిపి ఉనికి చాటుకుంటున్నదే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులున్న కారణంగా. అయితే, ఇప్పటి తెలుగుదేశంపార్టీ మాత్రం అవసరానికి తగ్గట్లుగా ఎవరితో కలవటానికైనా సిద్దపడుతోంది. కారణమేమిటంటే, ఇప్పటి తెలుగుదేశానికి నేతృత్వం వహిస్తున్నది చంద్రబాబునాయుడు కావటమే.
ఇది చంద్రబాబు టిడిపి
అప్పట్లో ఎన్టీఆర్ విలువలను పాటించేవారు కాబట్టే పూర్తిస్ధాయిలో కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. కానీ ఇప్పటి చంద్రబాబుకు అధికారం నిలుపుకోవటమే లక్ష్యం. అందుకోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలపటానికి వెనకాడరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఒకపుడు బిజెపితో పొత్తులు పెట్టుకుని దెబ్బతిన్న తర్వాత ఇక జన్మలో బిజెపితో చేతులు కలిపేది లేదని బహిరంగంగా ప్రకటించిన ఇదే చంద్రబాబు మళ్ళీ అవసరం కోసం 2014లో అదే బిజెపితో పొత్తులు పెట్టుకోవటం అందరూ చూసిందే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎంచక్కా కాంగ్రెస్, టిడిపిలు కలిసి పొత్తల్లో ఎన్నికలు ఎదుర్కొనే అవకాశాలున్నాయనటంలో సందేహం అవసరం లేదు.
కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ?
కాకపోతే కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న విషయంపైనే అయోమయం నెలకొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన దెబ్బ కాంగ్రెస్ పై పోయిన ఎన్నికల్లో చాలా తీవ్రంగా పడింది. పోటీ చేసిన 175 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్ధులు చాలా చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో జనాగ్రహం ఎలాగుంటుందో అంచనా వేయటం కష్టమే. అటువంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లిచ్చినా ఆమేరకు టిడిపి నష్టపోవాల్సిందే అన్న అనుమానం టిడిపిలో మొదలైంది. ఈ విషయంలో క్లారిటీ వచ్చి సీట్ల షేరింగ్ గనుక ఖాయమైతే బహిరంగంగా చట్టాపట్టాలేసుకుని తిరగటమే మిగిలింది.
ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికలు
ఇక, రాజ్యససభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నికల గురించి చూద్దాం. 244 సభ్యులున్న రాజ్యసభలో డిప్యుటీ ఎన్నికలో గెలవాలంటే ఏ కూటమికైనా కనీసం 123 ఓట్ల బలముండాలి. ప్రస్తుత బలాలను లెక్కిస్తే ఎన్డీఏ కూటమికి 115 మంది సభ్యుల బలముంది. అదే విధంగా యూపిఏ కూటమి అభ్యర్థికి సుమారుగా 110 మంది సభ్యుల మద్దతుంది. ఇతరులు, తటస్ధులు సుమారుగా 19 మంది దాకా ఉన్నారు. వీరిలో ఏ కూటమికి మద్దతిస్తే వారు గెలిచే అవకాశాలున్నాయి. బహుశా రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నిక ఇంత ఉత్కంఠగా జరగటం ఇదే మొదటిసారేమో ?