విశాఖపట్నం రైల్వేజోన్ ఆశలపైన కూడా కేంద్రప్రభుత్వ నీళ్ళు చల్లేసింది. దేశంలో కొత్త రైల్వేజోన్, డివిజన్ల ఏర్పాటు అంశమేదీ కేంద్రం పరిశీలనలో లేదని రైల్వేశాఖ సహాయమంత్రి రాజన్ గోహెన్ చేసిన ప్రకటనతో ఏపి విభజన హామీలకు కేంద్రం పూర్తిగా గండి కొట్టినట్లైంది. అడ్డుగోలు విభజన చేసి కాంగ్రెస్ ప్రజలను దెబ్బ కొడితే విభజన చట్టం అమలులో బిజెపి మోసం చేసిందన్నది అర్ధమైపోయింది. లోక్ సభలో కేంద్రం చేసిన తాజా ప్రకటనతో ఏపి అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏదో పగపట్టినట్లుగా కనబడుతోంది.
విభజన చట్టానికి తూట్లు పొడిచిన కేంద్రం
విభజన చట్టం అమలుపై కేంద్రం వైఖరి స్పష్టంగా అర్ధమవుతున్నా ఇటు రాష్ట్రంలోని ఎంపిలు మాత్రం చాలా కాలంపాటు జనాలను తప్పుదోవ పట్టించారు. మొదటగా ప్రత్యేకహోదాతో మొదలైన కేంద్రం మోసం చివరకు రైల్వేజోన్ ప్రకటనతో సమాప్తమైనట్లే. అంటే విభజన చట్టం అమలనేది ఒక బ్రహ్మపదార్ధంగా తయారైంది. విభజన హామీల్లో చాలా వాటిని కేంద్రం నెరవేర్చేసిందని మోడి చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు పూర్తి విరుద్దంగా మాట్లాడుతున్నారు. దాంతో ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమో జనాలకు ఆర్దం కావటం లేదు.
ప్రజలను మిస్ లీడ్ చేసిన బిజెపి నేతలు
విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందంటూ ఇంతకాలం బిజెపి నేతలు జనాలకు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేస్తోందంటూ ఈ మధ్య రాష్ట్రంలోని బిజెపి నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ ను అభినందించిన విషయం అందరూ చూసిందే. కానీ చివరకేమైంది ? రాష్ట్రాలు, జిల్లాలు, ఆధారంగా రైల్వేజోన్ ఏర్పడదంటూ కేంద్రం స్పష్టంగా ప్రకటించింది.
తాజా ప్రకటన కూడా మోసం చేయటమో !
రైల్వేజోన్లు, డివిజన్లను పునర్వ్యవస్ధీకరించాలని కేంద్రం అనుకోవటం లేదని కూడా చెప్పారు. పైగా నిర్వహణ, పరిపాలనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం జోన్ల ఏర్పాటు అవుతాయని కూడా చెప్పారు. ఇంత చెబుతూనే ఏపి విభజ చట్టంలో చెప్పినట్లుగానే రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందంటూ కంటితుడుపు ప్రకటన చేయటం కూడా జనాలను మోసం చేయటమే అనటంలో సందేహం అవసరం లేదు. విభజన చట్టం అమలు చేయటంలో ఏపి జనాలను దారుణంగా మోసం చేసిన బిజెపి వచ్చే ఎన్నికలను ఏ ధైర్యంతో ఎదుర్కోవాలని అనుకుంటోందో అర్ధం కావటం లేదు.