ఈరోజు జరుగనున్న రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక విషయంలో వైసిపి తన వైఖరిని స్పష్టం ప్రకటించింది. విభజన చట్టం అమలులో హామీ ఇచ్చి జనాలను మోసం చేసినందుకు ఈరోజు జరిగే రాజ్యసభ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ప్రకటించారు. విభజన చట్టానికి సంబంధించి ప్రతీ విషయంలోనూ అటు కాంగ్రెస్, ఇటు బిజెపిలు రెండూ ఏపిని మోసం చేశాయని మండిపడ్డారు.
యూపిఏ కే మద్దతు ప్రకటించిన వైసిపి
ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభలో డిప్యుటి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేనంత ఉత్కంఠగా ఈ ఎన్నిక జరగబోతోంది. అందుకనే ప్రతీ ఓటూ చాలా కీలకమే అనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించినట్లు వైసిపి మొన్న ప్రకటించింది. బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేయటమంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ అభ్యర్ధిని వైసిపి బలపరుస్తోందని అనుకున్నారు. వైసిపి నేతలు కూడా అదే విధంగా ప్రకటనలు ఇస్తున్నారు.
ఓటింగ్ కు దూరమంటే ఎన్డీఏకి సహకరించినట్లే
అయితే తెరవెనుక ఏం జరిగిందో స్పష్టంగా తెలీదు కానీ ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తాము రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. బహుశా రాష్ట్ర రాజకీయ పరిస్దితుల్లో బిజెపికి ఓటు వేయకపోయినా సరే యూపిఏ అభ్యర్ధికి మాత్రం ఓట్లు వేయద్దని బిజెపి నేతలు వైసిపిని ఒప్పించినట్లు సమాచారం. అందుకనే ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. రాజ్యసభలో వైసిపికి ఉన్నది ఇద్దరు సభ్యులే అయినప్పటికీ అవి కూడా చాలా కీలకమే.