రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ విషయం లో వైసిపీ మొదటి నుంచి కూడా బీజేపీ కీ వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏమైందో ఏమో కానీ చివరి నిమిషం లో వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయ సాయి మేము ఎవరికీ ఓటు వేయడం లేదని ప్రకటించాడు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఏపీకి తీరని ద్రోహాన్ని చేశాయన్నారు. అందులో రెండోమాటకు తావులేదన్నారు.
ఈ కారణంగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు. విభజిత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం మాటగా చెప్పారన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరనిద్రోహం చేసిందన్నారు.
మరోవైపు పదేళ్లుహోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మాట నిలబెట్టుకోకుండా ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. రాష్ర్టానికి ద్రోహం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టీడీపీ కుమ్మక్కైందని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా గుంటూరులో వంచనపై గర్జన సభలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో విపక్షాల అభ్యర్థికి ఓటువేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామనడం గమనార్హం.