వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైట్ లో చంద్రబాబునాయుడు చేతులెత్తేశారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా జగన్ గడచిన ఏడు మాసాలుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్రకు జనాల స్పందన కూడా అంతకంతకూ పెరుగుతోంది.
స్పందన లేని చంద్రబాబు సమావేశాలు
అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నిర్వహిస్తున్న ధర్మ పోరాట సభలు, గ్రామవికాశ సమావేశాలు పేరేదైనా జనాలు లేక వెలవెల పోతున్నాయి. చివరకు సెంటిమెంటు అద్దుతూ రాష్ట్ర విభజన పేరుతో నిర్వహించిన నవనిర్మాణ దీక్షల్లో కూడా జనాలు పాల్గొనటం లేదు. దాంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది. జగన్ పాదయాత్రలో జనాలు పాల్గొనకుండా ఆపలేరు. అలాగని జనాలు పాల్గొంటుంటే చూడలేకపోతున్నారు.
మీడియాను అడ్డం పెట్టుకుని జగన్ పై యుద్దం
అందుకనే తమకు మద్దతుగా నిలబడే మీడియా ద్వారా జగన్ పై మానసిక యుద్ధం మొదలుపెట్టినట్లుంది. జగన్ పై కేసులంటే కొత్తేమీ లేదు. జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ అని, స్వాధీనమని ఇలా ఎన్నో విధాలుగా గతంలోనే రాసేశారు. ఆ రాతల్లో చాలా వరకూ అబద్దాలని తేలిపోయింది. నిజమేమిటంటే జగన్ మీడియా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. కాబట్టి కొత్తగా ఉంటుందని జగన్ సతీమణి వైఎస్ భారతిపై తమ మీడియాలో వార్తలు రాయించటం మొదలుపెట్టారు.
టిడిపి మీడియా రాతలను జనాలు నమ్ముతారా ?
భారతీ సిమెంట్స్ పై వైఎస్ భారతి ముద్దాయని, ఎన్ ఫోర్స్ మెంటు డిపార్ట్ మెంటు (ఈడి) వేసిన చార్జిషీటులో భారతి పేరును ఇడి చేర్చిందంటూ టిడిపి మీడియా పెద్ద ఎత్తున రాసాయి. నిజానికి చార్జిషీటులో భారతి పేరును చేర్చటానికి అనుమతి కోరుతూ కోర్టు ఈడి లేఖ మాత్రమే రాసింది. అంతమాత్రానే చార్జిషీటులో భారతి పేరని, చార్జిషీటులో ముద్దాయిగా భారతి అంటూ ఒకటే ఊదరగొట్టేశాయి. సరే టిడిపి మీడియా రాతలను జనాలు నమ్ముతారా లేదా అన్నది వేరే సంగతి. ముందైతే జగన్ తో పాటు ఆయన కుటుంంపై చల్లిన బురదను జగన్ అయితే కడుక్కోవాలి కదా ? అందుకు ఎంతో కొంత సమయమైతే కేటాయించాలి కదా ?
టిడిపి లక్ష్యం నెరవేరుతుందా ?
గతంలో కూడా టిడిపి మీడియా ఇదే విధంగా వ్యవహరించింది. జగన్ పై ఉన్న కేసుల్లో విచారణ విషయంలో ఒకటి జరిగితే బయట ఇంకోలా ప్రచారం చేసింది. అన్ని వేల కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేసేసిందంటూ ఒకటే రొద పెట్టింది. తీరా చూస్తే అదంతా తప్పని తేలిపోయింది. జగన్ పై ఉన్న ఒక్కో కేసును కోర్టు కొట్టేస్తుండటాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతుందని అర్దమవుతోంది. దాంతో ఏదో ఒక రకంగా జగన్ ను గబ్బు పట్టించటమే టార్గెట్ గా పెట్టుకుంది.
అంటే జరుగుతున్నవి చూస్తుంటే జగన్ పై నేరుగా యుద్దం చేయలేక ఆయన భార్యను లేదా కుటుంబసభ్యులను కూడా కేసుల పేరుతో లాగుతున్నట్లు కనబడుతోంది. మరి టిడిపి, దాని మీడియా లక్ష్యం ఎంత వరకూ నెరవేరుతుందో చూడాల్సిందే.