దొంగే దొంగ అన్నట్లుంది గురజాల టిడిపి ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు వ్యవహారం. గుంటూరు జిల్లాలో గురజాల ఎంఎల్ఏ యరపతినేని వ్యవహారం ప్రస్తుతం జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు స్వయంగా కోర్టు నిర్దారించిన తర్వాత సిగ్గు పడాల్సిన ఎంఎల్ఏ ఇపుడు ఎదురుదాడికి దిగటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వైసిపినే అక్రమాలు చేస్తోందట !
ఇంతకీ విషయం ఏమిటంటే, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే వైసిపి నేతలు ఆయనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు చేకస్తున్నారంటూ యరపతినేని మండిపడుతున్నారు. అక్రమ మైనింగ్ పై వాస్తవాలు బయటకు తీసే ఉద్దేశ్యంతో వైసిపి నేతలు ఈ రోజు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించాలని అనుకున్నారు. అయితే, వైసిపి నేతల ప్రయత్నాలను పోలీసుల ద్వారా ఎంఎల్ఏ అడ్డుకున్నారు. వైసిపి ఎంఎల్ఏలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి కృష్ణారెడ్డి , నరసరావుపేట ఎంపి నియోజకవర్గం సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టులు చేశారు. దాంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటి నుండి ఎంఎల్ఏ పై వైసిపి నేతలు వరుసగా ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు.
కోర్టు ఆక్షేపణలన్నీ అబద్ధాలేనా ?
ఆ విషయంపైనే ఎంఎల్ఏ మాట్లాడుతూ, సరస్వతి భూముల విషయంలో రైతులకు అండగా నిలిచినందుకే వైసిపి తనను టార్గెట్ చేసిందని ఎంఎల్ఏ కొత్త విషయాన్ని బయటపెట్టారు. అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దుష్ప్రచారం మొదలుపెట్టిందట వైసిపి. పైగా వైసిపి తీరే దొంగ దొంగ అని అరిచినట్లుందని కూడా అనేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని కూడా యరపతినేని ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. సరే, వైసిపి తీరు ఎలాగుందన్నది వేరే విషయం. ఎంఎల్ఏ చేస్తున్న మైనింగ్ యాక్టివిటీలో భారీ అక్రమాలు జరుగుతున్నదని స్వయంగా కోర్టు నిర్దారించింది అబద్దమా ? ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడింది వాస్తవం కాదా ? మొత్తం మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతా నాటకమేనా ?
ఇన్ని మాటలు మాట్లాడిన ఎంఎల్ఏ తాను అక్రమ మైనింగ్ చేయటం లేదని మాత్రం చెప్పలేదు.