పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ముచ్చట పడుతున్న  బీజేపీ ఆశలకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) గండి కొట్టేసింది. ఒకేసారి ఎన్నికలకు అనుకూలమని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా లా కమిషన్‌కు లేఖ రాసిన మరుసటి రోజే ఈసీ ఇలా షాక్ ఇచ్చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాధనా సంపత్తి తమ వద్ద లేవని, అందువల్ల  లోక్ సభ, శాసన సభలకు ఒకేమరు ఎన్నికలు సాధ్యం కాదని  స్పష్టం చేసింది.


వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం తమ వల్ల కానే కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ రోజు పేర్కొన్నారు.  జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వీవీపాట్‌ యంత్రాలు తమ వద్ద లేవని కూడా అసలు సంగతి చెప్పేశారు. ఇదిలా ఉండగా  దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నిన్ననే లా కమిషన్‌కు లేఖ రాశారు.


రాష్ట్రాల్లో ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతున్నదని, అందువల్ల ఒకేమారు ఎన్నికలు బెటర్ అంటూ ఆ లేఖలో వివరించారు. తరచూ ఎన్నికలతో పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేయడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని కూడా షా చెప్పారు. కానీ మోడీ, షా ద్వయానికి మింగుడు పడని డిసిషన్ ని ఈసీ ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే తీసుకుని భారీ షాక్ ఇచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: