చంద్రబాబునాయుడు ప్రభుత్వ ప్రచారార్భాటం మరీ విచిత్రంగా ఉంది. రాజధాని నిర్మాణానికి జారీ చేసిన అమరావతి బాండ్లు గంటలోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యిందని ఒకటే ఊదర గొడుతోంది. రూ. 1300 కోట్లను సమీకరించే ఉద్దేశ్యంతో మంగళవారం ప్రభుత్వం బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో బాండ్లను ట్రేడింగ్ కు ఉంచగానే రూ. 2 వేల కోట్లకు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది. దాంతో టిడిపికి మద్దతుగా నిలిచే మీడియా ఒకటే ఊదరగొడుతోంది ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యిందంటూ. పైగా దేశంలోనే ఇదొక రికార్డంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తోంది.
ఎక్కువ వడ్డీనే ఆకర్షణ
ఇందులో అసలు విషయాన్ని దాచిపెట్టి ప్రభుత్వం ప్రచారం చేయించుకుంటోంది. ఎవరైనా తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తామని చెబితే సదరు వడ్డీ వ్యాపారి వద్దకు జనాలు క్యూ కట్టరా ? అదే విధంగా జనాల డబ్బుకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెబుతున్న వారి వద్ద ఎక్కువ మొత్తంలో జనాలు పెట్టుబడి పెట్టరా ? ఇక్కడా అదే జరిగింది. అధిక వడ్డీ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టే గంటలోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది.
జిహెచ్ఎంసి, పూణే కన్నా ఎక్కవ వడ్డీ
ఇంతకు ముందు నిధుల సమీకరణ కోసం జిహెచ్ఎంసి కూడా బాండ్లను జారీ చేసింది. 8.9 శాతం వడ్డీ ఇస్తామని హామీ ఇవ్వటంతో ఈ బాండ్లు కూడా ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయి. అదేవిధంగా పూణేలో కూడా 7.9 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేస్తే మంచి స్పందనే కనబడింది. ఇపుడు ఏపి ప్రభుత్వం ఏకంగా 10.32 శాతం వడ్డీని ఇస్తానని చెప్పింది. పైగా ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటోంది. ఇక, ఓవర్ సబ్ స్క్రైబ్ అవ్వటంలో ఆశ్చర్యమేముంది ?
ప్రచారం తప్ప ఇంకేమీ లేదు
టిడిపి నేతల వాదన చాలా విచిత్రంగా ఉంటుంది. గతంలో కూడా ప్రపంచబ్యాంకు నుండి అప్పు తీసుకున్నపుడు కూడా ఇదే విధంగా ప్రచారంతో ఊదరగొట్టేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు అప్పు కోసం ప్రయత్నించినా వాళ్ళందరినీ కాదని ఏపికి అప్పు ఇవ్వటానికి ప్రపంచ బ్యాంకు మొగ్గు చూపిందన్నారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వటమంటే మామూలు విషయం కాదన్నారు. అందరూ నిజమే అనుకున్నారు. తీరా చూస్తే విషయం మెల్లిగా బయటపడింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే, ప్రపంచ బ్యాంకు ఇచ్చే అప్పుకు మిగిలిన రాష్ట్రాలు అధిక వడ్డీ ఇవ్వటానికి అంగీకరించలేదు. చంద్రబాబు ఒక్కడే ప్రపంచబ్యాకు షరతులకు ఒప్పుకుని అధిక వడ్డీ చెల్లించటానికి అంగీకరించారు. అందుకనే ఏపికి అప్పు ఇచ్చింది. ఇక్కడ కూడా అధిక వడ్డీ, ప్రభుత్వ గ్యారెంటీ వర్కవుటైంది. అంతేకానీ అమరావతి బ్రాండూ లేదు తోటకూరా లేదు.
అమరావతి ఎక్కడుంది ?
జారీ చేసిన అమరావతి బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయంటేనే అమరావతికి ఉన్న బ్రాండ్ ఇమేజే కారణమని టిడిపి మీడియా ఒకటే ఊదరగొట్టేస్తోంది. ఇప్పటి వరకూ అమరావతి అన్నది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. నిజానికి అమరావతి అన్నది చంద్రబాబుకు మాత్రమే పరిమితమైన గ్రాఫిక్స్ ప్రపంచం. అసలింత వరకూ అమరావతి నిర్మాణానికి పూర్తిస్ధాయి ప్లానే సిద్దం కాలేదు. ఎప్పుడు నిర్మాణం అవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్లాన్లే సిద్దం కాని, నిర్మాణమే ఆరంభం కాని అమరావతికి బ్రాండ్ ఇమేజి ఎక్కడ నుండి వస్తుంది ? అంతా టిడిపికి మద్దతిచ్చే మీడియాలో తప్ప ?