పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు ఇంకా తీరలేదు. ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడుతుండటంతో పనులు చేయాల్సిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ నత్తకే నడకలు నేర్పిస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తామె ఖర్చు పెడుతూ పనులను చేయిస్తున్నట్లు చంద్రబాబునాయుడు చెబుతున్నవన్నీ ఉత్త మాటలేనా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. పనులను దక్కించుకున్న నిర్మాణ సంస్ధే కాకుండా పాద ధరలకే తాము పనులను పూర్తి చేస్తామని ముందుకొచ్చిన నవయుగ సంస్ద కూడా ఇపుడు వెనకాడుతోంది. దాంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగటం లేదు.
జిఎస్టీ దెబ్బ దారుణంగా పడింది
ఇంతకీ విషయం ఏమిటంటే, పోలవరం పనులపై జిఎస్టీ దెబ్బ భారీగా పడుతోందట. చేపట్టే ప్రతీ పనికి నిర్మాణ సంస్ధలు జిఎస్టీ చెల్లించాల్సి రావటమే పెద్ద ఇబ్బందిగా తయారైందట. భారీ ప్రాజెక్టులన్నాక నిర్మాణ సంస్ధలు యంత్ర సామగ్రి కొనుగోలు చేయక తప్పదు కదా ? అందులోనూ ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు జరగాల్సి ఉంది.
ఆగిపోతున్న పనులు
ఈ పనులన్నీ చేయాలంటే అనేకరకాల యంత్రాలు అవసరం. అవన్నీ కొనుగోలు చేసేటపుడు వాటి అసలు ధరలపై జిఎస్టీ వేయటం మామూలే. ఆ జిఎస్టీని నిర్మాణ సంస్ధలు చెల్లించాల్సి రావటమే పెద్ద తలనొప్పిగా తయారైందట. అందుకనే యంత్రాల కొనుగోలుకు నిర్మాణసంస్ధలు వెనకాడుతున్నాయి. దాంతో యంత్రాలు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయే పరిస్ధితి వచ్చింది. దాంతో ఏం చేయాలో ఉన్నతాధికారులకు అర్ధం కావటం లేదు. ఒకవైపు పనులు వేగంగా జరగటం లేదని చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో ఏమో ?