రాష్ట్రంలో అవినీతి తారస్ధాయికి చేరుకున్నట్లు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం కండబద్దలు కొట్టినట్లు చెప్పారు. విశాఖపట్నంలో ' పతనమవుతున్న రాజకీయ విలువలు' అనే అంశంపై జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతిని అన్నీరంగాల్లోకి ప్రభుత్వం తారస్ధాయికి చేర్చిందంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే మైనింగ్, ఇసుక అక్రమ వ్యాపారాలు యధేచ్చగా సాగుతోందంటూ చెప్పటంపై సర్వత్రా చర్చ మొదలైంది. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో వివిధ స్ధాయిల్లో సేవలందించిన కల్లం చంద్రబాబునాయుడు పాలనపై ఇంత కచ్చితంగా తన అభిప్రాయాలను చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.
రైతుల భూములతో రియల్ వ్యాపారమా ?
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగటం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల నుండి ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ చేసిందంటూ మండిపడ్డారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి 12 మంది సిఎంలు హాజరైతే చంద్రబాబు హోటల్ బిల్లు రూ. 8.7 లక్షలు అవటమేంటని కల్లా ఆశ్చర్యపోయారు. రాచరికాలు ముగిసినా ప్రజాస్వామ్యం ముసుగులో అవే విధానాలు కొనసాగుతున్నట్లు కల్లం ఎద్దేవా చేశారు.
ఐవైఆర్ కు కల్లం జత కలిశారా ?
చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఒకవైపు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా దుమ్ముదులిపేస్తున్నారు. చంద్రబాబు పాలనలోని లోపాలను, జరుగుతున్న అవినీతిని ఎక్కడికక్కడ ఐవైఆర్ ప్రతీ రోజూ ఎత్తి చూపుతున్నారు. సరే, ప్రభుత్వం తన లోపాలను సరిచేసుకుంటున్నదా లేదా అన్నది వేరే సంగతి. ఐవైఆర్ లాగ కాకపోయినా కల్లం కూడా అప్పుడప్పుడూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ చంద్రబాబు పాలనపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా నిర్మొహమాటంగా మాట్లాడుతుండటం గమనార్హం.