జనసేన అధినేత పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానాలు మొదలయ్యాయి. ఈ మధ్య పవన్ విడుదల చేసిన జనసేన మ్యానిఫెస్టోపై బిసి సామాజికవర్గ నేతలు మండిపోతున్నారు. సామాజికంగా ఎటువంటి వెనుకబాటుతనంలో లేని కాపులను ఏ ప్రాతిపదికపై బిసిల్లో చేరుస్తారంటూ ధ్వజమెత్తుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చేచేందుకు కృషి చేస్తానంటూ పవన్ ఇచ్చిన హామీని బిసిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చెప్పిందొకటి- చేసిందొకటి !
ఇక్కడ విచిత్రమేమిటంటే, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని సిద్ధాంత పత్రాన్ని విడుదల చేసిన పవన్ తన మ్యానిఫెస్టోలో మాత్రం కాపులకు రిజర్వేషన్లని, బిసిలకు అదనంగా 5 శాతం రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇవ్వటం. అంటే సిద్ధాంతపత్రంలో చెప్పేదొకటి, మ్యానిఫెస్టోలో పెట్టిందకొటి అన్న విషయం స్పష్టమైపోయింది.
ఈ చిచ్చు ఎప్పటికి ఆరుతుందో ?
ఎవరు కాదన్నా అవునన్నా వచ్చే ఎన్నికల్లో సామాజికవర్గాల అంశం కూడా పార్టీల గెలుపోటముల్లో కీలకమవుతుంది. అందులోనూ కాపులు, బిసిల సామాజికవర్గాలదే ప్రధాన పాత్ర. సామాజికవర్గాల గొడవలు రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్నవే. కాకపోతే అవి ఏవో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సందర్భానుసారం పరిమితమై ఉండేవి. అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంతో పోయిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లన్న హామీతో చంద్రబాబునాయుడు చిచ్చు పెట్టారు. ఇపుడా చిచ్చే పెరిగి పెద్దదైంది. కాపులకు రిజర్వేషన్లంటే తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదంటూ బిసి నేతలు పవన్నే హెచ్చరిస్తున్నారు. సామాజికవర్గాల చిచ్చు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.