వచ్చే ఎన్నికలలో ఏపీలో కనీసం సీట్లు అయినా సాధించాలని ఎత్తులు వేస్తున్న బీజేపీ ముందు తన బలం ఏంటన్న దానిపై ఓ రహస్య సర్వే జరిపిస్తోందట. ఆ సర్వే ఫలితాల బట్టి ముందుకు వెళ్ళాలని కమలనాధులు ఆలోచిస్తున్నారని సమాచారం. అలాగే 2019 ఎన్నికలలో ఏపీలో పొత్తులు ఉంటాయని కూడా బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ పొత్తుల కధ అన్నది ఇంటెరెస్టింగ్ పాయింటే.
ఎవరితో పొత్తు :
ఏపీలో అసలే బీజేపీ అంటే జనం ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. అంతలా ఆ పార్టీని జనంలో పాపాల భైరవుడిగా మార్చిన ఘనత టీడీపీదే. ఇపుడు ఏపీలో అన్ని రకాల సమస్యలకూ బీజేపీ కారణమని ఆ పార్టీ చేసిన ప్రచారం సక్సెస్ అయింది. దాంతో బీజేపీ అంటేనే జనమే కాదు పార్టీలు జడుసుకునే పరిస్థితి ఉంది. ఈ టైంలో పొత్తులు అంటే పరుగున వచ్చేదెవరు అన్న అనుమానాలు వస్తునాయి.
ఆ వైపే చూపు :
ఏపీలో ఎంపీ సీట్లు బీజేపీకి బాగా ఎక్కువగా కావాలి. పొత్తులు ద్వారా మాత్రమే అవి దొరుకుతాయి. మరి పొత్తులకు ఎవరు వస్తారు అన్నది ఆలోచించినపుడు టీడీపీతో చెడింది కాబట్టి ఫస్ట్ చూపు వైసీపీ మీదనే ఉంది. ఆ పార్టీ నేతలతో బీజేపీ పెద్దలు టచ్ లో వున్నారని అంటున్నారు. అయితే పొత్తులపై జగన్ వద్దకు వచ్చిన ఓ రాయబేరాన్ని ఆయన గట్టిగా పక్కన పెట్టేశాడని టాక్ నడుస్తోంది. ఆ కారణంగానే జగన్ లేటేస్ట్ గా మళ్ళీ కేసుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు పవన్ తోనూ జట్టు కట్టాలని బీజేపీ ట్రై చేస్తోంది. పవన్ ఇప్పటికే కామ్రెడ్స్ తో చెలిమికి సై అనేసాడు. మరి ఎలా చూసుకున్నా వైసీపీ, , జనసేనలే బీజేపీకి ఆప్షన్లుగా ఉన్నారు. పొత్తుల ఎత్తులపై అపర చాణక్యుడు అమిత్ షా వ్యూహం ఏంటో తెలియక ఏపీ బీజేపీ లీడర్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.