ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలపై మంత్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. తాజాగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావుల్లో ఆందోళన స్పష్టంగా బయటపడిపోయింది. ఇంతకీ వారి బాధేమిటంటే జగన్ ఇస్తున్న హామీలు అమలు కావాలంటే, నాలుగు దేశాల బడ్జెట్ కావాలట. మంత్రుల వాదన విచిత్రంగా ఉంటోంది. ఒకవైపు జగన్ హామీలను ఎవరూ నమ్మరని చెబుతూనే ఇంకోవైపు హామీల అమలుకు జగన్ నిధులు ఎక్కడి నుండి తెస్తారంటూ మండిపడుతున్నారు.
జనాల్లో సానుకూలతే కనబడుతోంది
జగన్ హామీలను జనాలు నమ్ముతారో నమ్మరో భవిష్యత్తులో కానీ తేలదు. ఇప్పటికైతే జగన్ హామీలను ఇస్తున్నాడు, జనాలు సానుకూలంగా స్పందిస్తున్నారు. జగన్ పాదయాత్రలో జనాలు పాల్గొంటున్న విషయం గమనిస్తేనే ప్రజలు సానుకూలంగా ఉన్నారన్న విషయం అర్ధమవుతోంది. పాదయాత్రలో పాల్గొన్న జనాలందరూ రేపటి ఎన్నికల్లో వైసిపికి ఓట్లేస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. వేస్తారన నమ్మకంతో వైసిపి నేతలున్నారంతే.
హామీలు సహజమే కదా ?
పాదయాత్రలో పాల్గొంటున్న జనాలను చూసిన తర్వాతే మంత్రుల్లో ఆందోళన పెరిగిపోతోందన్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలు చేయటం సహజమే. దాంతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారనే విషయంపై జనాలకు భరోసా కల్పిస్తారు. అదే సమమంలో కొన్ని హామీలనూ ఇస్తారు. జగన్ ఇపుడు చేస్తున్నదదే.
వైసిపికి అధికారం అప్పగిస్తారా ?
వచ్చే ఎన్నికల్లో అధికారం అప్పగిస్తే హామీలను నెరవేరుస్తాడనే నమ్మకముంటే జనాలు జగన్ కు అధికారం అప్పగిస్తారు. లేకపోతే లేదు. అది జనాల సమస్య. మధ్యలో మంత్రులకెందుకు అంత ఉలికిపాటు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాడనే కదా జనాలు చంద్రబాబుకు పట్టం కట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎంత వరకూ చంద్రబాబు నెరవేర్చింది అందరికీ తెలిసిందే. ఇపుడు జగన్ ఇస్తున్న హామీలను జనాలు నమ్మి వైసిపికి ఎక్కడ అధికారం అప్పగిస్తారో అన్న ఆందోళనే మంత్రులు కనబడుతోంది.