రైతులంటే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బాగా చులకనైపోయినట్లున్నారు. లక్ష రూపాయల అప్పు కోసం రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తనకు అర్ధం కావటం లేదనటం సంచలనంగా మారింది. కర్నూలులో జెడ్పి మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన రుణమాఫీ గ్రీవెన్స్ సెల్ లోనే రైతులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటం వివాదంగా మారింది. రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చి చూడటం మరింత ఇబ్బందిగా మారింది.
లక్ష రూపాయల అప్పుకే ఆత్మహత్యా ?
వేల కోట్ల రూపాయలు అప్పులను ఎగొట్టి విదేశాలకు పారిపోతున్న పారిశ్రామికవేత్తలెవరూ ఆత్మహత్యలు చేసుకోకపోయినా రైతులు ఆత్మహత్యలు చేసుకోవటంలో అర్ధం లేదన్నట్లుగా మాట్లాడారు. ఒకవైపు ఆదర్శవంతంగా తమ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ మంత్రి నిలదీశారు.
జిల్లా మొత్తాన్ని కరువుగా ప్రకటించాలి
ఒకవైపు రైతుల రుణాల మాఫీ గురించి మంత్రి గొప్పలు చెప్పుకుంటున్న సమయంలోనే ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, సోమిరెడ్డి గాలి తీసేశారు. కరువు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేయటంపై కెఇ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాల్లో కరువు తీవ్రంగా ఉండగా కేవలం 37 మండలాలను మాత్రమే ఎంపిక చేయటమేంటని సోమిరెడ్డిని నిలదీశారు. జిల్లా మొత్తాన్ని కరువుపీడిత జిల్లాగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నకిలీ విత్తనాల బెడద చాలా ఎక్కువగా ఉందంటూ సోమిరెడ్డి గాలి తీసేశారు.