తుపానులు, భారీ వానలు, ఎవరికి ఆనందం కలిగించాయో తెలియదు కానీ టీడీపీ తమ్ముళ్ళకు మాత్రం తెగ హ్యాపీగా ఉందట. ఈ దెబ్బతో ప్రత్యర్ధి అవుట్ అని పడిన సంబరం ఎక్కువ సేపు లేదు. వానలకు సైతం లెక్కచెయకుండా అక్కడి సభలకు జనం వెల్లువలా రావడంతో పసుపు శిబిరానికి మైండ్ బ్లాంక్ అయిందంట. దానితో పాటే వచ్చిన ఇంటలిజెన్స్ నివేదికా నిద్రపట్టనీయడంలేదట.
వెల్లువగా జనం :
విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర మొదలుకాకముందే భారీ తుపాన్లతో బీభత్సమైన వాతావరణం. ఎక్కడ చూసినా వానలే వానలు. దాంతో జగన్ పాదయాత్ర వెల వెల పోతుందని జిల్లాకు చెందిన టీడీపీ తమ్ముళ్ళు హుషార్ చేశారు. అయితే ఈ నెల 14న జగన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన జనమే జనంగా పాదయాత్ర సాగుతోంది. ఆగస్ట్ 15 న జగన్ జెండా వందనం చేస్తున్న సమయంలో జోరు వాన కురిసింది..అయినా ఎర్రవరం గ్రామమంతా వచ్చి అక్కడకు చేరింది. ఇక ఆ తరువాత పాదయాత్ర అంతా వానలోనే సాగింది.
అదిరిపోయిందిగా :
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే నర్శీపట్నం నడిబొడ్డున జగన్ తొలి బహిరంగ సభ టాప్ రేపింది. వేలాదిగా జనం వచ్చిన ఆ సభ మొత్తం వానలోనే జరిగింది. గొడుగులు పట్టుకుని మరీ వచ్చిన జనం ఒక్కరు కూడా కదలకపోవడం విశేషం. జగన్ స్పీచ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా జగన్ వెంట ఇలా కదులుతూ మహిళలు, యువకులు, పెద్దలు అన్న తేడా లేకుండా జన ప్రవాహం చూసి టీడీపీ నాయకుల గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి.
సీన్ మారింది :
మొదట్లో జగన్ సభలకు జనాలను తరలిస్తున్నారని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇలా ప్రతికూల పరిస్థితులలోనూ జనం పెద్ద ఎత్తున కదలి రావడం, జగన్ కోసం ఎదురు చూపులు చూడడంతో వారంతా స్వచ్చందంగానే వచ్చారని తెలుసుకుని కంగారు పడుతున్నారు. దానికి తోడు ఇంటెలిజెన్స్ నివేదిక సైతం ఇదే సంగతి చెప్పడంతో ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదు. మంత్రి అయ్యన్న ఇలాకాలో రికార్డ్ స్థాయిలో జనం వచ్చారని నివేదికలు చెబుతున్నాయి. ఇక జగన్ వేసే ప్రతి అడుగులోనూ మహిళ, యువత కనిపించడంతో అధికార పార్టీలో గుబులు రేగుతోంది. ప్రస్తుతం జగన్ ప్రభంజం విశాఖ జిల్లాలో సాగుతోంది. ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.