టాలీవుడ్ లో ప్రముఖ నటి వాణిశ్రీ అంటే తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన వాణిశ్రీ మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అప్పట్లో ఏఎన్ఆర్, వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డు సొంతం చేసుకున్న ఆమె తర్వాత కాలంలో అత్త, అమ్మమ్మ పాత్రల్లో నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వాణిశ్రీ పై ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను వయసులో ఉన్నపుడు సినిమాలు బాగా చూసేవాడినని..అప్పట్లో ఎన్టీఆర్ కి వీరాభిమానిననీ అన్నారు. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మరో మంత్రి నారాయణతో కలసి సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ను ప్రారంభించిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వాణిశ్రీని ప్రేమించానని, ఆమెకు వీరాభిమానినని, ఆమె చిత్రాలన్నీ చూశానని చెప్పారు. అప్పట్లో ప్రతి సినిమా మనసుకు హత్తుకునేలా ఉండేవని..తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.
ఏపిలో సినీ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని..ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉపాది కూడా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, నటి వాణిశ్రీ, నటుడు భాగ్యరాజ్, నిర్మాత సీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చిత్రాలను నిర్మించాలని చూసే వారికి లోకేషన్ల సమస్య రానీయబోమని, ఉత్తమ చిత్రాలకు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. డిసెంబర్ 26 నుంచి మూడు రోజుల పాటు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్టు చెప్పిన అంబికా కృష్ణ, రూ. 4 కోట్ల లోపు తీసే చిత్రాలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నామని తెలిపారు.