ఈమధ్య కాలంలో సోషల్ మీడియా దెబ్బకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కళ్ళు తేలేస్తోంది. మీడియా చూపని, మీడియాలో కనబడని రెండో పార్శ్వం కూడా సోషల్ మీడియా కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. సోషల్ మీడియా అంటే టిడిపి భయపడుతోంది. అందుకే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ జరిగేవరకూ సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారాన్ని నిషేధించాలంటూ ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసింది. మీడియాలో మెజారిటీ చంద్రబాబునాయుడుకు పూర్తి మద్దతుగా నిలబడిందన్న విషయంలో సందేహం లేదు. ఒకవైపు చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతూనే సిఎం ప్రత్యర్ధులపై అదే పనిగా బురదచల్లుతున్న సందర్భాలు చాలా జరిగాయి.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్
ప్రధాన ప్రతిపక్షమైన వైసిపికి చెందిన మద్దతుదారులు, కార్తకర్యలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చంద్రబాబు, లోకేష్ తో పాటు టిడిపి నేతల వ్యాఖ్యలను, వ్యక్తిగతాన్ని, చరిత్రను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చీల్చి చెండాడేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసిపి మద్దతుదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. అందుకే వైసిపిని అడ్డుకునేందుకు టిడిపి కొత్త ఎత్తులు వేస్తోంది.
టిడిపికి నష్టమేనా ?
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ జరిగే వరకూ సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారాన్ని నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి కోరింది. కేంద్రం మీడియాను కంట్రోల్ చేయగలదే కానీ సోషల్ మీడియాను ఎలా కంట్రోల్ చేయగలదని టిడిపి అనుకుంటోందో ఎవరికీ అర్దం కావటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియా కన్నా సోషల్ మీడియానే పవర్ ఫుల్లని టిడిపికి అర్ధమైనట్లుంది. రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా వల్ల టిడిపికి జరగబోయే నష్టంపై టిడిపి నేతలు భయపడుతున్న విషయం స్పష్టమైంది.