తెలుగుదేశంపార్టీ ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న నారా హమారా-టిడిపి హమారా ప్రోగ్రామ్ తుస్సుమంది. వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను కొల్లగొట్టే వ్యూహంతోనే చంద్రబాబునాయుడు నారా హమారా సమావేశాన్ని టిడిపి భారీ ఎత్తున నిర్వహించింది. ఏమాశించి టిడిపి సమావేశాన్ని నిర్వహించిందో ఆ లక్ష్యం నెరవేరిందా అన్నది సందేహమే. ఎందుకంటే, సమావేశంలో పాల్గొన్న సాధారణ ముస్లింల నుండి పెద్దగా స్పందన కనబడలేదు. నిజం చెప్పాలంటే నారా హమారా సదస్సు విఫలమైందనే చెప్పాలి.
నాలుగేళ్ళు ముస్లింలనే పట్టించుకోని చంద్రబాబు
కేంద్రంతో భాగస్వామ్యం ఉన్నంత కాలం ముస్లింలను పట్టించుకోని చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వచ్చారు. వెంటనే ఇష్టం వచ్చినన్ని పథకాలు పెట్టేశారు. అప్పటి వరకూ చంద్రన్న తోఫా అనే ఒకటి రెండు పథకాలు మాత్రమే ఉండేవి. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత వరుసబెట్టి ఎన్నో పథకాలు పెట్టారు. అప్పటి నుండి ముస్లింలను ఉద్ధరిస్తున్నది తాను మాత్రమే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు. ఈరోజు సమావేశంలో ముస్లింల కోసం తానెంతగా కష్టపడుతున్నది చెప్పుకుంటూ తన భుజాన్ని తానే చరుచుకున్నారు.
ఎన్డీఏ ఓడాలంటే వైసిపి, జనసేన ఓడాలట
చంద్రబాబు స్పీచ్ లో హైలైట్ ఏమిటంటే, ఎన్డీఏ ఓడిపోవాలంటే రాష్ట్రంలో వైసిపి, జనసేన ఓడిపోవాలట. ప్రధానమంత్రి అంటే భయపడే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నారట. జగన్ ఒక వైపు పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతుంటూ ఇంట్లో కూర్చున్నారని చంద్రబాబు చెప్పటం విచిత్రంగ ఉంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింలందరూ టిడిపికే ఓట్లు వేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టమని చంద్రబాబు చెప్పినపుడు పెద్దగా స్పందించలేదు. మొదటి నుండి ముస్లింల సంక్షేమానికి టిడిపినే కట్టుబడుందని గట్టిగా చప్పట్లు కొట్టమన్నపుడు కూడా ఎవరూ పెద్దగా స్పందించలేదు. మొత్తం మీద భారీగా ప్రచారం చేసుకున్న నారా హమారా టిడిపికి నిరుత్సాహాన్ని మిగిల్చిందనే చెప్పాలి.