ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు సొంత ఫాం హౌజ్ లోనే జరపాలని కుటుంబం నిర్ణయించింది. మొయినాబాద్ లో హరికృష్ణకు ఒక ఫాం హౌజ్ ఉంది. నాలుగేళ్ళ క్రితం మరణించిన పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు కూడా ఇదే ఫాం హౌజ్ లో జరిగింది. జానకిరామ్ కూడా ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
కొడుకు అంత్యక్రియలు జరిగిన చోటే
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ మరణించిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొడుకులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, సోదరులు బాలకృష్ణ తదితరులు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అంతిమ సంస్కారాలు గురువారం మధ్యాహ్నం సొంత ఫాం హౌజ్ లో జరిపాలని నిర్ణయించుకున్నారు. హరికృష్ణ పోస్టు మార్టమ్ నిర్వహించిన తర్వాత పార్ధివ దేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వటానికి ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఆసుపత్రికి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి తదితరులు కూడా చేరుకున్నారు.
ట్రస్ట్ భవన్ కు తరలిస్తారా ?
ఈరోజు మధ్యాహ్నానికి మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి పార్దివ దేహాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నందమూరి అభిమానులు, పార్టీ నేతలు, శ్రేణులు చివరి చూపు కోసం మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.