చంద్ర బాబు హరికృష్ణ పాడిని మోసాడని టీడీపీ మానస పుత్రిక అయినటువంటి ఒక పత్రిక గొప్పగా ప్రచురించింది. అయితే చంద్ర బాబు ఇంతక ముందు హరికృష్ణ కు చేసిన ద్రోహాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేది. హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబు వ్యక్తిగత సంబంధాలు ఇటీవల కాలంలో కొంత ఎగుడుదిగుళ్లకు లోనయ్యాయని, కాని కుటుంబం బంధాల ముందు మిగిలనవన్నీ తక్కువేనని చంద్రబాబు స్పందన రుజువు చేసిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నట్టు ఆ పార్టీ ఆత్మ, అంతరాత్మ అయిన ఆ పత్రికలో ప్రచురించారు.
అంతా బాగానే ఉంది. అసలు హరికృష్ణ రాజకీయ భవిష్యత్కు బావ చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారం ఏనాడో పాడె కట్టి శ్మశానానికి తరలించారని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పదవీచ్యుతుడైన తర్వాత ఎన్టీఆర్ విశాఖలో విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారంటే... చంద్రబాబు సీఎం పదవి కోసం నా కుటుంబంలో చిచ్చుపెట్టావు. నా బిడ్డల్ని పావులుగా వాడుకున్నావు. నేనంటే భయభక్తులతో ఉండే నా బిడ్డల్ని రెచ్చగొట్టావు. ప్రలోభపెట్టి హరికృష్ణను బానిసగా చేసుకున్నావు.
మనిషివైతే, మమత ఉంటే, భక్తి ఉంటే హరికృష్ణను సీఎంగా చేయాలని సవాల్ విసురుతున్నా అని అన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టడంతో పాటు తన బిడ్డలకు కనువిప్పు కలిగించేందుకు నాడు ఎన్టీఆర్ ఈ విధంగా సవాల్ విసిరారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తన కుమారుడిని 2009లో రాజకీయ ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత తగిన హోదా కల్పించి ప్రాధాన్యం ఇస్తారని హరికృష్ణ విశ్వసించారు. చంద్రబాబు నుంచి మళ్లీ అదే నిరాకరణ, మళ్లీ అదేదగా. హరికృష్ణ తట్టుకోలేకపోయారు. పార్టీ కార్యక్రమాలకు, చంద్రబాబుకు పూర్తిగా దూరంగా జరిగారు.