విభజన హామీల అమలులో నరేంద్రమోడి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ఏపిని దెబ్బకొట్టిందన్న విషయం స్పష్టమైపోయింది. విభజన హామీల అమలుపై పార్లమెంటరీ స్ధాయి సంఘం జరిపిన విచారణలో 13 కేంద్రప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పొంతనలేని సమాధానాలివ్వటమే అందుకు నిదర్శనం. ప్రత్యకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, రెవిన్యు లోటు భర్తీ ఇలా అంశమేదైనా కానీండి సంఘం సభ్యులడిగిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వలేకపోయారు.
పొంతన లేని సమాధానాలు
విశాఖపట్నం రైల్వేజోన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నకు సమాధానంగా ఒడిస్సా ప్రభుత్వం అడ్డపడుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు. వెంటనే సంఘంలో ఉన్న సభ్యుడు, ఒడిస్సా ఎంపి ప్రసన్నకుమార్ పట్సానీ అభ్యంతరం చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటుకు తమ రాష్ట్రం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, అటువంటిదేమైనా ఉంటే చూపాలన్నపుడు ఉన్నతాధికారులు నీళ్లు నమిలారు. ప్రత్యేకహోదా ఇచ్చేందుకు లేదని 14వ ఆర్దిక సంఘం సిఫారసు చేసిందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిఫారసులు చూపించమని అడిగితే సమాధానం లేదు. అసలు తాము అటువంటి సిఫారసే చేయలేదని ఆర్దిక సంఘం సభ్యులు చెప్పారు కదా ? అని ఎంపి రమ్మోహన్ నాయుడు నిలదీస్తే సమాధానం చెప్పలేకపోయారు.
కేంద్రం కొట్టిన దెబ్బ అర్ధమైపోతోంది
ఏపిలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజి అమలు చేస్తామన్న ప్రధానమంత్రి హామీని గుర్తు చేస్తే సమాధానం చెప్పలేకపోయారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజికి బదులుగా ఏడాదికి రూ. 350 కోట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నిస్తే ఉన్నతాధికారులు సమాధానం చెప్పలేదు. విడుదల చేసిన రూ. 350 కోట్లను ఎందుకు వెనక్కు తీసుకున్నారని ? మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. విడుదల చేసేందుకు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నట్లు మాత్రమే సమాధానం చెప్పారు. ఉన్నతాధికారులు సమాధానాలు చెప్పిన తీరు చూస్తుంటే నాలుగేళ్ళుగా కేంద్రం ఏపిని ఏ విధంగా దగా చేసిందో అర్ధమైపోతోంది.